హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పైప్లైన్లో లీకేజీ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. లీకేజీలను సరిచేయడానికి రాజేంద్రనగర్ వద్ద భారీ మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు, మొత్తం 20 గంటల పాటు కొనసాగుతాయి. ఈ మరమ్మత్తు పనుల వల్ల పలు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోతుందని మెట్రో వాటర్ బోర్డు ప్రకటించింది. రెండు రోజులపాటు షేక్పేట, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్నగర్, తట్టిఖానా పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని మెట్రోవాటర్ బోర్డు తెలిపింది.
ఈ మరమ్మత్తు పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ వద్ద 1400 ఎంఎం డయా పైప్లైన్లోని భారీ లీకేజీని సరిచేస్తారు. అంతేకాకుండా అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 ఎంఎం స్కవర్ వాల్వ్ ఎక్స్టెన్షన్ పైప్లో ఉన్న లీకేజీని కూడా రిపేర్ చేస్తారు. అలాగే మైలార్దేవ్పల్లి ఫేజ్-3 పంప్ హౌస్లో పనిచేయని వాల్వ్లను కూడా మార్చనున్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడానికి మెట్రో వాటర్ బోర్డు అదనపు సిబ్బందిని నియమించింది.
హైదరాబాద్కు నీటి సరఫరా చేసే ప్రధాన ప్రాజెక్టులలో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఒకటి. కృష్ణానది జలాలను పంపింగ్ స్టేషన్ల ద్వారా నగరానికి సరఫరా చేస్తారు. ఈ పైప్లైన్లు చాలా పెద్దవిగా, అధిక ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించబడ్డాయి. అయినప్పటికీ, పాత పైప్లైన్ల కారణంగా లేదా నిర్మాణ లోపాల వల్ల అప్పుడప్పుడు లీకేజీలు ఉంటున్నాయి. ఈ లీకేజీల వల్ల లక్షల లీటర్ల నీరు వృథా అవుతుంది. అంతేకాకుండా సరఫరాలో అంతరాయాలు ఏర్పడతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మెట్రో వాటర్ బోర్డు తరచుగా మరమ్మత్తు, నిర్వహణ పనులను చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ రెండు రోజులు ప్రజలు తమ అవసరాల కోసం నీటిని నిల్వ ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa