తెలంగాణలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ మండల కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీ మంజూరైంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఈ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతిస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచే కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆరోగ్య శాఖ కార్యదర్శిని, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను అభినందించారు.
కొడంగల్ మెడికల్ కాలేజీతో కలిపి తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మెడికల్ కళాశాల్లో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే... ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రస్తుతం 8,340 కంటే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్లు 4,100 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక వైద్య విద్యలో స్థానికతపై సుప్రీంకోర్టు జీవో 33ని సమర్థించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ తీర్పు తర్వాత వైద్య విద్యా మండలి ఒకట్రెండు రోజుల్లోనే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది.
కాగా, తెలంగాణ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. స్థానిక కోటా 85 శాతం కింద ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాశ్వత నివాసం ఉన్నవారు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవాల్సిన అవసరం లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారులు, కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగుల పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు కొత్త జీవో జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రవేశాలు పొందిన విద్యార్థుల అర్హతకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. వారి ప్రవేశాలను మార్చవద్దని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుతో వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయ్యింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మినహాయింపు పొందిన ఉద్యోగుల పిల్లల కోసం జీవో 33కు సవరణలు చేస్తూ కొత్త జీవో తీసుకురానుంది. ఈ నెల 10 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa