తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ అనూహ్య పరిణామం తర్వాత కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన తదుపరి రాజకీయ ప్రయాణంపై ఆమె బుధవారం ఓ మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారు.కవిత సస్పెన్షన్ వార్త తెలియగానే, హైదరాబాద్లోని ఆమె నివాసం వద్దకు మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు టి. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.గత కొంతకాలంగా కవిత, పార్టీ వైఖరికి భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను ఆమె బహిరంగంగా సమర్థించారు. అంతేకాకుండా, సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తాను స్థాపించిన తెలంగాణ జాగృతి వేదికగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటి పరిణామాలు సస్పెన్షన్కు దారితీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనేలా ఆమె వ్యాఖ్యలు ఉండడం బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టింది. హరీశ్ రావు, సంతోష్ ల వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని కవిత వ్యాఖ్యానించడం తెలిసిందే. వాళ్లిద్దరి వల్లే కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్ మాత్రం కవిత పార్టీ లైన్ దాటిందన్న ఉద్దేశంతో సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు, కవిత సస్పెన్షన్ను బీఆర్ఎస్ మహిళా నేతలు సమర్థించారు. కుమార్తె కంటే పార్టీయే గొప్పదని కేసీఆర్ నిరూపించారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ తనకు ఇచ్చిన ఎంపీ, ఎమ్మెల్సీ పదవులను మరిచిపోయి, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కవిత వ్యవహరించారని వారు విమర్శించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిలో కవిత ఒకరిగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే జి. సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కవిత స్వయంగా నాశనం చేసుకున్నారని ఆమె అన్నారు. రేపటి మీడియా సమావేశంలో కవిత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa