ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్,,,,,రైతు భరోసా నిధుల విడుదల అప్పుడే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 07:20 PM

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి సరైన తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల్లో పార్టీలతో సంబంధం లేకుండా.. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఇస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు పంటల రుణాల మాఫీ పథకం కింద రూ.21 వేల కోట్లను అందించినట్లు తెలిపారు. దీంతో 25.35 లక్షల మంది రైతులకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్‌ కూడా ఇస్తున్నట్లు వివరించారు. రైతు భరోసా పథకం కింద రూ.6 వేల చొప్పున ఇప్పటివరకు రూ.9 వేల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు.


రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధికంగా రైతుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలో గతంలో రేషన్ కార్డుల కోసం 10 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు మాత్రం అప్లై చేయగానే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో 3.17 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


సన్న బియ్యం అందుకుంటున్న వారు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి కోరారు. వరి పంట ఉత్పత్తిలో ఆసియాలోనే మిర్యాలగూడ ముందుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని.. ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎదురే లేదని.. తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన బీఫాం మీద పోటీ చేస్తున్న మహిళలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.


మరోవైపు.. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టే తెలంగాణ బడ్జెట్‌లో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు లక్షలాది మందిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. గతంలో నల్గొండ జిల్లాపై ఉన్న కోపంతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కనపెట్టారని.. ఆ ప్రాజెక్టు ఆగిపోతే మామ, అల్లుళ్లు ధావత్ చేసుకున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కారణంగానే నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్‌ నీళ్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్‌ఎల్‌బీసీని రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే.. మొత్తం తెలంగాణ జాతికి ఇచ్చినట్లు చెబుతున్నారని సీఎం విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa