సాధారణంగా చాలా మంది భక్తులు తమకు నచ్చిన దేవుళ్లకు మొక్కులు మొక్కుతూ.. వారికి నచ్చిన వాటిని హుండీల్లో వేస్తూ, విరాళాలుగా ఇస్తూ తమ భక్తిని చాటుకుంటారు. కానీ పెటా.. ఆలయానికి ఇచ్చిన ఓ విరాళం కారణంగా దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. ముఖ్యంగా హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పెటాపై పెద్ద ఎత్తునే విమర్శలు చేస్తున్నారు. మీరు ఇలాంటి విరాళాలనే ఇతర మతాల వాళ్లకు అందిస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా కడిగేస్తున్నారు. అసలీ వివాదం ఏంటి, పెటా విరాళంగా ఏమిచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ ఇటీవలే.. కేరళలోని త్రిస్సూర్ శ్రీకృష్ణ దేవాలయానికి ఓ "బొమ్మ ఏనుగు"ను విరాళంగా ఇచ్చింది. పేరుకు బొమ్మ ఏనుగు అయినప్పటికీ నిజమైన జంతువులుగానే ఇది నడుస్తూ, కదులుతూ ఉంటుంది. ముఖ్యంగా తోక, తొండాన్ని ఊపుతూ.. కాళ్ల కింద ఉన్న చక్రాల ద్వారా ముందుకు వెళ్తుంటుంది. ఇటీవలే దీన్ని పెటా విరాళంగా ఇవ్వగా.. ఆలయ నిర్వాహకులు సైతం దీన్ని స్వీకరించారు. కేవలం తీసుకోవడమే కాకుండా ఉత్సవాల్లోనూ దీన్ని ఉపయోగించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని చూసిన హిందువుల్లో చాలా మంది.. అసలు బొమ్మ ఏనుగును విరాళంగా ఎందుకు ఇచ్చారంటూ పెటాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ఊరేగింపు కోసం ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తున్న ఏనుగులనే ఉపయోగిస్తామని.. వాటికి బదులుగా ఇలాంటి వాటిని వాడమంటూ చెప్పుకొస్తున్నారు. ఇతర మతాల వాళ్లకు కూడా ఇలాంటి బొమ్మలనే విరాళంగా ఇచ్చే ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ముస్లింల పండగలప్పుడూ.. ఆవులకు బదులుగా బొమ్మ ఆవులను ఇవ్వండి, క్రిస్టియన్లకు గొర్రెలకు బదులుగా బొమ్మ గొర్రెలు ఇవ్వండి అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై పెటా ఇంకా స్పందించలేదు. కానీ శ్రీకృష్ణ ఆలయానికి బొమ్మ ఏనుగును విరాళంగా ఇవ్వడం వెనుక కథను మాత్రం వివరించింది. నిజమైన ఏనుగులను ఉపయోగించడం కోసం... ఆలయ నిర్వాహకులు వాటిని తీవ్రంగా కష్ట పెడుతున్నారని, హింసిస్తున్నారని చెప్పుకొచ్చింది.
అది చూడలేకే తాము ఆలయానికి బొమ్మ ఏనుగును విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో హిందువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూనే.. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని చెబుతున్నారు. తాము దేవుడి కోసం ఉపయోగించే ఏనుగులకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకుంటున్నామని.. తమ మతంలో పశువులకు సేవ చేయడం ఒక బాధ్యతగా భావిస్తామంటూ వెల్లడిస్తున్నారు. చూడాలి మరి దీనిపై పెటా ఎలా స్పందించబోతుందనేది.
![]() |
![]() |