ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. పోలీసుల సాయంతో పురుడు పోసిన తోటి ప్రయాణికులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 08:14 PM

నెలలు నిండిన మహిళలకు ఎప్పుడు పురిటి నొప్పులు వచ్చి డెలివరీ అవుతుందో ఎవరూ చెప్పలేం. 9 నెలలు పడినప్పటి నుంచే సహజ కాన్పు అయ్యే వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాగే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యంగానే ఉన్నానని ఓ మహిళ రైలులో ప్రయాణించింది. కానీ మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. విషయం గుర్తించిన తోటి ప్రయాణికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రైలు ఓ స్టేషన్ వద్ద ఆగే సరికే ఆమెకు నొప్పులు తీవ్రం కాగా.. పోలీసులు వెంటనే ఆమె వద్దకు వచ్చారు. ఈక్రమంలోనే పోలీసుల సాయంతో ప్రయాణికులు మహిళకు పురుడు పోశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ మహిళ ప్రస్తుతం గర్భవతి. నెలలు కూడా నిండాయి. కానీ ఆరోగ్యంగానే ఉండడంతో ఆనంద్ విహార్ నుంచి సహర్సాకు వెళ్లే రైలులో ప్రయాణించేందుకు సిద్ధమైంది. రైలు కూడా ఎక్కి కూర్చుంది. అయితే అప్పుడే మెళ్లిగా మహిళకు పురిటి నొప్పులు రావడం మొదలైంది. ముందుగా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించగా.. తోటి ప్రయాణికులు ఏమైందని ప్రశ్నించారు. నొప్పులు వస్తున్నాయని చెప్పగానే అప్రమత్తమయ్యారు. వెంటనే రైల్వే స్టేషన్‌లోని అధికారులకు సమాచారం అందించారు.


అయితే వారు వచ్చేలోపే మహిళకు నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. అప్పటికే రైల్వే భద్రతా సిబ్బంది ఎస్సై నవీన్ కుమారి డీ7 కోచ్‌లోని మహిళ వద్దకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను బయటకు తీసుకెళ్లడం అని భావించి.. ప్రయాణికుల సాయంతో అక్కడే పురుడు పోయాలని భావించారు. ఇలా అందరూ కలిసి మహిళకు అండగా నిలవగా ఆమె క్షణాల్లోనే ప్రసవించింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే అధికారులు అంబులెన్సుకు ఫోన్ చేయగా.. దాని ద్వారానే తల్లీ, బిడ్డలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.


ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి బాగుందని చెప్పగా.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చే వరకు అక్కడే ఉండి.. కావాల్సిన సాయం చేశారు. ఆపై ఎస్సై సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రి నుంచి మళ్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మహిళ రైలులోనే ప్రసవించిన విషయం తెలుసుకున్న ప్రజలంతా ఆమెకు సాయం చేసిన పోలీసు భద్రతా సిబ్బింది సహా ప్రయాణికులకు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో కూడా దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలు.. రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సాయంతో ప్రసవించారు. పండంటి మగ, ఆడ శిశువులకు జన్మను ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com