కేరళలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించారు. అగస్త్య మహర్షి ఆలయం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ అంశంపై రియాక్టయ్యారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారన్న పవన్ కళ్యాణ్... అలాంటి భక్తుల మనోభావాలు గాయపడకూడదనేదే తన ఆవేదన అని చెప్పారు.
తిరుమల లడ్డులో కల్తీ జరగడం దురదృష్టకరమన్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదని కోరుకున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం సంతోషించదగిన విషయమన్న పవన్ కళ్యాణ్.. అదంతా కేసు దర్యాప్తులో భాగమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్రీవారి ప్రసాదాలు, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగత అంశమని వెల్లడించారు, తన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని క్లా్రిటీ ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల కోసం ఈ పర్యటనకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ఆరోగ్యం సహకరించపోయినా రావాల్సి వచ్చిందని వివరించారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి కూడా హాజరుకాలేకపోయారు.
![]() |
![]() |