ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన ఉచితాలను తాజాగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఉచితంగా రేషన్, నగదు అందుతుండటంతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో పని చేయకుండా ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది. ఎన్నికల్లో ఉచిత పథకాలను ప్రకటించే విధానం మంచిది కాదని అభిప్రాయపడింది. ఉచిత పథకాలతో లబ్దిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్ మండిపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఈ అంశంపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది.
జనవరిలోనూ సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహెన్తో పాటు పలు పథకాలను ప్రకటించి.. సొమ్ములను పంచిపెడతారని మండిపడింది. ఢిల్లీలో ఇప్పుడు ఓ పార్టీ రూ.2,500 ఇస్తామంటే.. ఇంకో పార్టీ తాము దీనికి రెట్టింపు ఇస్తామని హామీ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాలకు డబ్బులు ఉంటాయని, కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం ఉండవని తూర్పారబట్టింది. గతంలో సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాథ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో ఉచితాలు అంటే ఏమిటి? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిని తాము అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీరు వంటివి సౌకర్యాలు ఉచితాలుగా పరిగణించవచ్చా? ప్రజల హక్కా..? అని ప్రశ్నించింది
అయితే, ఉచితాలపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2013లో సుబ్రమణ్యం బాలాజీ కేసులో మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ‘అర్హులైన వ్యక్తులకు కలర్ టీవీలు, ల్యాప్టాప్లు మొదలైన వాటి రూపంలో పెద్ద మొత్తంలో పంపిణీ చేయడం అనేది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించింది.. ఇందులో జోక్యం చేసుకోలేము’ అని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ పోటాపోటీగా ఉచితాలను ప్రకటించాయి. దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలు.. నగదు ఆధారిత పథకాలపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీనిని పరిశీలించిన హైకోర్టు. అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది
![]() |
![]() |