ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇవాళ గుంటూరు కోర్టుకు హాజరై కస్టోడియల్ టార్చర్ కేసులో వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును గత ప్రభుత్వం సీఐడీ లీగల్ అసిస్టెంట్ గా నియమించి, రూ.48 లక్షల ఫీజు చెల్లించారని ఆరోపించారు. హైకోర్టులో 12 సీఐడీ కేసుల విచారణ నిమిత్తం అతడిని లీగల్ అసిస్టెంట్ గా నియమిస్తున్నట్టు పేర్కొన్నారని వివరించారు. సీఐడీ క్రిమినల్ కేసుల విషయంలో హైకోర్టులో ట్రయల్ ఉండదని, కానీ నిబంధనలకు విరుద్ధంగా తులసిబాబుకు పదవి అప్పగించారని తెలిపారు. ఈ నియామకం... తులసిబాబుకు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు మధ్య ఉన్న సంబంధాలకు నిదర్శనం అని స్పష్టం చేశారు. తులసిబాబు 2021 అక్టోబరులో బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకున్నారని, కానీ, 2020లోనే అతడిని సీఐడీ లీగల్ అసిస్టెంట్ గా నియమించారని వివరించారు. న్యాయవాదిగా కొనసాగేందుకు అర్హత లేని తులసిబాబును లీగల్ అసిస్టెంట్ గా నియమించి భారీమొత్తంలో ఫీజు చెల్లించడంపై ఏసీబీకి లేఖ రాస్తానని రఘురామ వెల్లడించారు.
![]() |
![]() |