ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8కి చేరిన మృతుల సంఖ్య.. మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 08:41 PM

గులియన్ బారే సిండ్రోమ్ మహారాష్ట్ర ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. ఓవైపు మృతుల సంఖ్య మరోవైపు కేసుల సంఖ్య పెరగడంతో.. ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతో వస్తోంది. అరుదైన న్యారోలాజికల్ డిజార్డర్ అయిన జీబీఎస్.. ఇప్పటి వరకు పుణేలోనే ఎక్కువ మందికి సోకగా.. తొలిసారి ముంబయిలోనూ తొలి మరణం చోటు చేసుకుంది. తాజాగా 53 ఏళ్ల వ్యక్తి మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు చనిపోయాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ముందుగా పుణేలోనే ఎక్కువ గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కాగా.. కొన్నిరోజుల నుంచి ముంబయి నుంచి కూడా కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కొత్తగా 5 కేసులు నమోదు కాగా.. 167గా ఉన్న కేసుల సంఖ్య.. 172కు చేరుకుంది. అలాగే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ముంబయిలోనూ తొలి మరణం నమోదు అయింది. ఇలా మృతుల సంఖ్య 8కి చేరుకుంది.


వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో జనవరి 22వ తేదీన ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు జీబీఎస్ సోకినట్లు 23వ తేదీన గుర్తించారు. ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్న ఇతడిని.. దవాఖానాలోనే ఉంచుకుని చికిత్స చేశారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మూడు వారాలుగా వెంటిలేటర్ మీదే ఉన్న అతడి పరిస్థితి మరింత విషమించగా.. మంగళవారం రోజు ప్రాణాలు కోల్పోయాడు.


ఈ విషయాన్ని నేరుగా మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖయే వెల్లడించింది. ముఖ్యంగా 172 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కాగా.. అందులో పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40, ఇతర గ్రామాల నుంచి 92, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 29, పుణే రూరల్ ఏరియాలో 28, మిగతా జిల్లాల నుంచి 8 కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇలాగే ఇప్పటి వరకు వ్యాధి సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన 104 మంది డిశ్చార్జీ అయ్యారని చెప్పారు.


ప్రస్తుతం 50 మంది రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతుండగా.. మరో 20 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు వివరించారు. అలాగే రోగుల కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని.. ఇది ఎక్కువగా క్యాంపిలోబాక్టర్ బెజుని అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ సూక్ష్మజీవిని కూడా అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com