ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొందరికి కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:49 PM

మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. కిడ్నీలు బాడీలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని శుభ్రపర్చడం, శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి పనుల్ని కిడ్నీలు నిర్వహిస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.


ఎంతో కీలకమైన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదముంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే, కొందరు వ్యక్తులు కిడ్నీ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఏ వ్యక్తులకు కిడ్నీ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.


అధిక రక్తపోటు


​అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు మూత్రపిండాల వ్యాధుల బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు మూత్రపిండంలోని రక్త నాళాలను కుదించి, ఇరుకుగా చేస్తుంది. దీని కారణంగా కిడ్నీలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో, మూత్రపిండాలు సరిగా పనిచేయలేవంటున్నారు నిపుణులు. రక్తపోటు పెరిగినప్పుడు, మూత్రపిండ ధమనులు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుంది.


డయాబెటిస్


ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ రోగులకు రక్తంలో చక్కెర, గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా, మూత్రపిండాల వైఫల్యం, మూత్రపిండాల సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.


ఊబకాయం


ప్రస్తుత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి కిడ్నీ వ్యాధుల ముప్పు ఎక్కువంటున్నారు నిపుణులు. పెరుగుతున్న ఊబకాయం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అధిక ఊబకాయం ఒక వ్యక్తికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి పరిస్థితులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ధూమపానం, మద్యపానం


ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారికి కూడా కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ధూమపానం, మద్యపానం ఎక్కువ చేయడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు అలవాట్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేయడం ద్వారా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రమాదాన్ని పెంచుతాయి. ధూమపానం మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది, ఇది మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.


కుటుంబ చరిత్ర


మీ కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండ వ్యాధి ఉన్నా లేదా జన్యువుల కారణంగా మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధుల హిస్టరీ ఉంటే వైద్యుణ్ని సంప్రదించి మీరు కూడా తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


కిడ్నీలను కాపాడుకోవడానికి చిట్కాలు


* అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు లేదా 60 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా వైద్యుణ్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.


* రోజూ తగినంత నీరు తాగాలి. ఇది శరీరం నుంచి వ్యర్థాలు, టాక్సిన్లను తొలగించడంలో సాయపడుతుంది.


* సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను ఆహారంలో భాగం చేసుకోండి.


* ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని పరిమితం చేయండి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాన్న తినడం మానుకోవాలి.


* తినే తిండితో పాటు శారీరక శ్రమ కూడా అవసరం. వ్యాయామాన్ని భాగం చేసుకోండి. మీకు ఏదైనా వ్యాధులు ఉంటే వైద్యుణ్ని సంప్రదించి తేలికపాటి వ్యాయామాలు చేయండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com