ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 07:55 PM

 దక్షిణ కొరయాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లను దహించివేస్తూ.. ఉవ్వెత్తున మంటలు ఎగిసిప డుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాత్రమే కాకుండా 1300 ఏళ్ల నాటి, యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ బౌద్ధ దేవాయలం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరోవైపు ఈ మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది విపరీతంగా కష్ట పడుతోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దావానలం అదుపులోకి రావడం లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


వారం రోజుల క్రితం దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్నే మిగిల్చింది. బలమైన పొడి గాలు కారణంగానే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని.. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ తెలిపింది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా వేలాది హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆరుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, మిగతా వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.


ఇది మాత్రమే కాకుండా కార్చిచ్చు కారణంగా 1300 ఏళ్ల నాటి పురాతన బౌద్ధ దేవాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ గుడికి గతంలోనే యునెస్కో గుర్తింపు కూడా లభించగా.. కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉన్నందున ఆలయంలోని కళాఖండాలతో పాటు పలు విగ్రహాలను ముందుగానే ఇతర దేవాయలకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఈ మంటలను అదుపు చేసేందుకు 10 వేలకు పైగా అగ్ని సిబ్బంది, పౌర సేవకులు శ్రమిస్తున్నారు. కార్చిచ్చు వల్ల బుధవారం నాటికి 43 వేల ఎకరాల అడవి, భూమి కాలినట్లు అధికారులు వెల్లడించారు.


మంటలు వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు వేరే ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. అలాగే 68 శాతం మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని.. కానీ ఉత్తర, దక్షిణ జయోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు దేశంలో ఏర్పడిన కార్చిచ్చుల్లో ఇదే అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ.. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కార్చిచ్చుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరో ఓసారి వాటిని చూసి.. దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం ఎంతగా ఉందో తెలుసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com