ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో భారీగా పాకిస్థానీయులు.. రంగంలోకి పోలీస్ బృందాలు

Crime |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 10:33 PM

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న పాకిస్థానీయుల గురించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 208 మంది పాకిస్థాన్ వాళ్లు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లలో సుమారు 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నట్టు తెలుస్తుండగా.. 13 మంది స్వల్పకాలిక వీసాలపై హైదరాబాద్‌ వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన 39 మంది వైద్య చికిత్సలు, వ్యాపార సంబంధిత పనులంటూ రకరకాల పనుల మీద హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.


అయితే.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22న) రోజు జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థానీయులంతా తిరిగి తమ దేశాలని వెళ్లిపోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు.. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్థానీయులు కూడా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో.. వైద్యం కోసం నగరానికి వచ్చిన వారికి ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు విధించగా.. మిగిలిన వారందరూ ఈ నెల 27వ తేదీలోగా నగరం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.


కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. నగరానికి వచ్చిన పాకిస్థానీయులు ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడ నివసించారు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు, ఇక్కడి వారిని ఎవరైనా వివాహం చేసుకున్నారా, వారి ప్రస్తుత ఫోన్ నంబర్లు ఏమిటి..? అలా సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు.


ఈ నెల 27వ తేదీన ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని.. నగరంలోని పాకిస్థానీయులందరూ నగరం విడిచి వెళ్లేలా పక్కా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారంతా నగరం విడిచి వెళ్లిన తరువాత, క్షేత్రస్థాయిలో వారి భౌతిక గుర్తింపు ప్రక్రియను (ఫిజికల్ ఐడెంటిఫికేషన్ డ్రైవ్) నిర్వహిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, పాకిస్థాన్ జాతీయులందరూ నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.


మరోవైపు.. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాద కదలికలపై నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా కొనసాగుతోంది. అనేక భద్రతా, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక నిఘా విభాగాలు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ, విశ్లేషిస్తూ అప్రమత్తంగా ఉంటున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ , ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై నిఘా ఉంచడంలో సహకరిస్తున్నాయి.


ఈ పరిణామాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అలజడులు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ చర్యలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంఘటితంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలను పూర్తిగా సమర్థిస్తూ తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు. హిందూ ముస్లింల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిగిన ఈ దాడిని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com