ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్ష రాస్తుండగా ఆపేసి, విద్యార్థితో కోడి కోయించిన ఉపాధ్యాయుడు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 09:38 PM

అతడో 9వ తరగతి చదవుతున్న బాలుడు. చివరి పరీక్షలు కాగా.. తనకు వచ్చిన సమాధానాలు రాస్తూ చాలా బిజీగా ఉన్నాడు. కానీ అప్పుడే అక్కడకు ఉపాధ్యాయుడు.. ఆ బాలుడిని బయటకు రమ్మన్నాడు. ఏమైంది సార్ ఎందుకంటుండగానే.. బయటకు తీసుకెళ్లి మరీ చేతిలో ఓ కోడిని పెట్టాడు. దాన్ని కట్ చేసి, స్కిన్ తీసేసి ముక్కలుగా కోయాలని చెప్పాడు. చెప్పింది ఉపాధ్యాయుడి కాబట్టి ఆ విద్యార్థి కూడా ఏమీ అనలేక కోడిని కోసి, ముక్కలు చేసి శుభ్రంగా కడిగిచ్చాడు. కానీ అప్పటికే పరీక్ష సమయం అయిపోగా.. చేసేదేమీ లేక ఇంటికెళ్లిపోయాడు. తోటి విద్యార్థులు అంతా ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పగా.. ఈ వార్త గ్రామమంతా గుప్పుమంది. పరీక్షల సమయంలో ఉపాధ్యాయుడు ఇలా చేయడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ఊరి వాళ్లు.. మరుసటి రోజు బడికి వెళ్లి ఉపాధ్యాడుతో గొడవకు దిగారు. ఆపై మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు.


రాజస్థాన్ ఉదయ్‌పూర్ జిల్లాలోని కొటాడ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 27వ తేదీన ఓ పరీక్ష జరుగుతుండగా.. 9వ తరగతి చదువుతున్న రాహుల్ కుమార్ అక్కడే పరీక్షలు రాస్తున్నాడు. తనకు వచ్చిన సమాధానాలు రాస్తూ.. ఫుల్ బిజీగా ఉండగా అప్పుడే అదే పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోహన్ లాల్ దోడా అక్కడకు వచ్చాడు. రేయ్ రాహుల్ అంటూ విద్యార్థిని పిలవగా అతడు భయపడిపోయాడు. ఏమైంది సార్ అంటూ వణుకుతూ అడిగాడు. కానీ ఉపాధ్యాయుడు మోహన్ లాల్ ఏమీ చెప్పకుండానే బయటకు రమ్మంటూ తీసుకెళ్లాడు. రాహుల్ మనసులో మాత్రం ఏమైంది, సార్ నన్నెందుకిలా బయటకు తీసుకు వస్తున్నారంటూ తెగ టెన్షన్ పడిపోతూనే ఉన్నాడు.


ఇంతలోనే ఉపాధ్యాయుడు మోహన్ లాల్ ఓ కోడిని తీసుకొచ్చి రాహుల్ చేతిలో పెట్టాడు. ఏమీ అర్థం కాని రాహుల్.. ఏంటి సార్ ఇదంటూ ప్రశ్నించగా.. కోసి, ముక్కలు చేసి శుభ్రంగా కడిగి తీసుకురమ్మని వివరించాడు. వెంటనే రాహుల్.. సార్ పరీక్ష రాశాకా కోసిస్తానని వివరించాడు. కానీ ఉపాధ్యాయుడు మాత్రం అదేం అవసరం లేదులేరా నువ్వైతే నేను చెప్పిన పని చేయుపో అంటూ తరిమాడు. దీంతో ఉపాధ్యాయుడిని ఏమీ అనలేక రాహుల్ కుమార్ కోడిని తీసుకుని వెళ్లాడు. దాన్ని కోసి, ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి ఇచ్చాడు. దీన్ని ఇవ్వాల్సింది నాకు కాదురా ఇంటికెళ్లి మేడమ్‌కు ఇవ్వుపో అంటూ చెప్పగా.. రాహుల్ ఆ ఉపాధ్యాయుడి ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశాడు.


తిరిగి బడికి వచ్చే సరికే పరీక్ష సమయం అయిపోగా.. చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. కానీ బడిలోని విద్యార్థులు అంతా ఈ విషయం గురించి ఊళ్లో వాళ్లకు చెప్పగా.. గ్రామస్థులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు అంతా కలిసి బడికెళ్లి మరీ ఉపాధ్యాయుడు మోహన్ లాల్ దోడాతో గొడవకు దిగారు. కానీ అతడు మాత్రం పెద్దగా స్పందించలేదు. దీంతో గ్రామస్థులు స్థానిక మంత్రి బాబూలాల్ ఖరారీని కలిసి ఫిర్యాదు చేశారు. పరీక్షల సమయంలో 9వ తరగతి విద్యార్థి చేత ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోడి కోయించాడని చెప్పారు. అలాగే నెల రోజుల క్రితం కుక్‌తో గొడవ పడి అతడిని తొలగించాడని.. ఫలితంగా అప్పటి నుంచి పిల్లలకు బడిలో మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం లేదని వెల్లడించారు.


ఇవి మాత్రమే కాకుండా విద్యార్థుల చేతే తన వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని ఉపాధ్యాయుడు మోహన్ లాల్‌పై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దర్యాప్తు చేయాలంటూ సూచించారు. ఇలా రంగంలోకి దిగిన అధికారుల విచారణలో ఇవన్నీ నిజమేనని తేలగా.. ఉపాధ్యాయుడు మోహన్ లాల్‌ను సస్పెండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa