విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖసటకపం ఉక్కు కర్మాగారంలోని కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్ఎంహెచ్పీ), కోకోవెన్, సింటర్ ప్లాంట్ వంటి విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. థర్మల్ పవర్ ప్లాంటును కూడా ప్రైవేటుపరం చేయడానికి టెండర్ పిలిచారు. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ ప్రకటన విడుదల చేశారు. తాజాగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఏకంగా 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచింది. దీనికోసం ఈవోఐ జారీ చేసింది. టెండర్ దాఖలు చేయడానికి సెప్టెంబరు 9 వరకు గడువు ఉంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఈవోఐలు జారీ చేయడం ఒక మార్గం అని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ప్రైవేటీకరణ కోసమే అన్నట్లుగా ఉందని.. పర్మినెంట్ సిబ్బందిని నియమించి, వారితో ప్లాంట్ను నడిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈవోఐలను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మెయింటెనెన్స్ పనుల కోసం ప్రైవేట్ టెండర్లు పిలిచేవారని.. ఇప్పుడు ముఖ్యమైన పనులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు EOI విడుదల చేశారన్నారు. ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చామని చెబుతోందని.. కానీ ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదంటున్నారు.
తెలంగాణలోని మాధారం గనులతో పాటు ఉక్కు కర్మాగారంలోని కొన్ని విభాగాలు జాబితాలో చేరాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2, 3లోని కొన్ని సెక్షన్లు, సీపీపీ, వైర్ రాడ్ మిల్ (డబ్ల్యూఆర్ఎం) వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (ఈఎండీ), రోలింగ్ మిల్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెంట్రల్ మిషన్ షాప్ (సీఎంఎస్), ఇంజినీరింగ్ షాప్స్ అండ్ ఫౌండ్రీ (ఈఎస్ అండ్ ఎఫ్) విభాగం కూడా ఉన్నాయి. స్టీల్మెన్ షాప్ (ఎస్ఎంఎస్), రీఫ్యాక్టరీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ (ఆర్ఈడీ), క్రేన్స్ వంటి విభాగాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa