ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంగవీటి రంగా విగ్రహానికి అవమానం.. చంద్రబాబు సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 07:47 PM

కాపు నేత, దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పనులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీనికి కారణమైన వారిని వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.


" ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, కలిదిండిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు" అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.


అసలు ఏం జరిగింది?


ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వంగవీటి రంగా విగ్రహాలకు పేడ పూయటం కలకలం రేపింది. కలిదిండి మండలంలోని కలిదిండి, ఆ పక్కనే ఉన్న మరో గ్రామం రుద్రవరంలోనూ వంగవీటి మోహన రంగా విగ్రహానికి దుండగులు పేడ పూయటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాయకుల విగ్రహాల మీద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.


 మరోవైపు ఇద్దరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి 01:05 నిమిషాలకు కలిదిండి ప్రధాన సెంటర్లో ఉన్న వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి పేడ పూసి అవమానించినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. సమాజంలో అల్లర్లు లేపటానికి.. కావాలనే ఒక సామాజిక వర్గాన్ని ఉసిగొల్పడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు,. వీలైనంత త్వరగా కారణమైన వారిని గుర్తించి.. నడిరోడ్డు పై నడిపించి తగిన బుద్ధి చెప్తానని అన్నారు. రంగా అభిమానులు శాంతం వహించాలని కోరారు. కారణమైనవారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని.. వారికి తగిన శిక్ష పడేలా చెయ్యటం తన బాధ్యత అని కామినేని శ్రీనివాస్ అన్నారు. రాబోయే కాలంలో ఎవరైనా ఇలాంటి పనులు చెయ్యాలంటే వెన్నులో వణుకుపుట్టేలా చేస్తామని కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa