దేశంలో భారీ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఛేదించారు. ఇందులో కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీ .. అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు.. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్ర పప్పీని శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే భారీ బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ క్యాసినోలు, దుబాయ్లోని గేమింగ్ ఆపరేషన్లతో ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీకి సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ బెట్టింగ్ రాకెట్ను పట్టుకునేందుకు ఈడీ అధికారులు.. ఆగస్ట్ 22, 23వ తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే గోవాలోని 5 ఫేమస్ క్యాసినోలపై ఈడీ అధికారులు భారీ ఎత్తున దాడులు చేశారు. పప్పీస్ క్యాసినో గోల్డ్, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ రివర్స్ క్యాసినో, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోలలో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం, వెండి, లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రూ. 12 కోట్ల నగదును పట్టుకోగా.. అందులో రూ. 1 కోటి ఫారిన్ కరెన్సీ ఉన్నట్లు తెలిపారు. ఇక అదే సమయంలో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 3 లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ 3 కార్లకు ఒకే వీఐపీ నంబర్ (0003) ఉన్నట్లు తెలిపారు.
ఇక ఈ సోదాల్లో ఈడీ అధికారులు మొత్తంగా 17 బ్యాంక్ అకౌంట్లతోపాటు 2 లాకర్లను సీజ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీ సోదరుడు కేసీ నాగరాజ్, అతని మేనల్లుడు పృథ్వీ ఎన్. రాజ్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే వీరేంద్రపై ఈడీ అధికారులు జరుపుతున్న దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'King567', 'Raja567' వంటి పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను ఎమ్మెల్యే వీరేంద్ర నడుపుతున్నట్లు తెలిపారు. ఇక ఆయన సోదరుడు కేసీ తిప్పేశ్వర దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్ట్టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే 3 గేమింగ్, కాల్ సెంటర్ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ఈ సోదాల్లో ఈడీ అధికారులు ఇంటర్నేషనల్ క్యాసినోల మెంబర్షిప్ కార్డులైన ఎంజీఎం, బెల్లాజియో, మెట్రోపాలిటన్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా తాజ్, హయత్ వంటి లగ్జరీ హోటల్స్ మెంబర్షిప్ కార్డులను కూడా సీజ్ చేశారు. కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన 50 ఏళ్ల ఎమ్మెల్యే వీరేంద్ర.. సిక్కింలోని గ్యాంగ్టక్లో క్యాసినో కోసం కొంత భూమిని లీజుకు తీసుకునేందుకు వెళ్లినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆయనను అక్కడి కోర్టులో హాజరుపరచగా.. బెంగళూరుకు తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో ఆయనను బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa