ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 7 దుర్గ గుడి మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 04:01 PM

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల వేళ భక్తుల రద్దీ మాములుగా ఉండదు. మీరు కూడా త్వరలోనే దుర్గమ్మ దర్శనం కోసం వెళ్లాలని భావిస్తున్నారా.. అయితే మీకో అలర్ట్. సెప్టెంబర్ 7న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసి వేయనున్నారు. ఈమేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం కీలక ప్రకటన చేసింది. మరి సెప్టెంబర్ 7 ఆలయాన్ని మూసి వేయడం వెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అంటే.. అవుననే చెబుతున్నారు.


సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఆలయ అధికారులు గుడి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్ర గ్రహణం నేపథ్యంలో సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఈవో వెల్లడించారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో అమ్మవారి ఆలయం తలుపులు మూసివేయమని వైదిక కమిటీ తెలిపిందని చెప్పారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9. 56 గంటల నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు చంద్రగ్రహణ సమయం కొనసాగుతుంది అన్నారు.


చంద్రగ్రహణం నేపథ్యంలో సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 3.30 గంటల నుంచి కనక దుర్గమ్మవారి ప్రధాన ఆలయంతో పాటుగా మల్లేశ్వర స్వామి, ఇతర ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గ్రహణకాలం ముగిసిన తర్వాత అనగా సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు గుడి తలుపులు తెరిచి సంప్రోక్షణ, స్నపనాభిషేకం వంటి క్రతువులు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.


గ్రహణం నేపథ్యంలో దుర్గ గుడిలో స్నపనాభిషేకం నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీన తెల్లవారుజామున నిర్వహించే పలు సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన కొన్ని సేవలను ఆలస్యంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలానే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు అస్తమించినట్లుగా కనిపించడం వల్ల అశుభసూచకంగా భావిస్తారు. దీనివల్ల ఆలయాల్లోని దేవతా విగ్రహాల శక్తి తక్కువ అవుతుందని.. దేవాలయం ప్రాంగణం మలినమవుతుందని నమ్ముతారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను అనుమతిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa