ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం అత్త హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Crime |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:56 PM

విశాఖపట్నంలో ఓ కోడలు.. దొంగాపోలీసు ఆట పేరుతో అత్తను కట్టేసి.. అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అత్త తన మీద భర్తకు చాడీలు చెప్తుతోందని.. అందుకే ఆమెను హత్య చేశానని సదరు కోడలు అంగీకరించింది. అంతేకాదు అత్తను చంపడానికి ప్రత్యేకంగా యూట్యూబ్ వీడియోలు చూసి మరీ ట్రైనింగ్ అయ్యిందని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్‌మెంట్ ఎఫ్‌ బ్లాకులో ఉండే.. జయంతి కనకమహాలక్ష్మి అనే 66 ఏళ్ల వృద్ధురాలిని.. ఆమె కోడలు లలిత పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. అందుకు గల కారణం.. జయంతి.. తన మీద భర్తకు చాడీలు చెప్తోందని ఆమెపై గత కొంతకాలంగా కక్ష పెంచుకున్న లలిత.. ఎలాగైనా అత్తను హత్య చేయాలని భావించింది. దీని కోసం యూట్యూబ్‌లో హౌ టు కిల్‌ ఓల్డ్‌ లేడీ అనే వీడియోలను చాలా సార్లు చూసింది.


వీటి ప్రకారం తన అత్తను హత్య చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. దీనిలో భాగంగా మూడు రోజుల క్రితం అనగా.. నవంబర్ 6వ తేదీన సాయంత్రం ఇంటి సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో 100 రూపాయల పెట్రోల్ కొని తెచ్చి.. ఇంట్లో దాచింది.


మరుసటి రోజు అనగా నవంబర్ 7వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో భర్త బయటకు వెళ్లాడు. ఇంట్లో లలిత, ఆమె కొడుకు, కూతురుతో పాటు లలిత తల్లి, అత్త కూడా ఉన్నారు. తన తల్లి స్నానం చేయడానికి బాత్‌రూంలోకి వెళ్లింది. ఆమె బయటకు వచ్చేలోపు అత్తను అంతమొందించాలని లలిత నిర్ణయించుకుంది.


అందులో భాగంగా పాపను పిలిచి.. మీ నానమ్మతో కాసేపు దొంగా పోలీస్ ఆట ఆడుకోమని చెప్పింది. వారు ఆడుతుండగా.. లలిత కూడా ఆటలో భాగమైంది. ఈ క్రమంలోనే అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లూ చేతులను నైలాన్ తాడుతో కట్టేసింది. ఆ తర్వాత అత్త కళ్లకు, నోటికి గంతలు కట్టేసి మీరు దాక్కోండి అని పిల్లల్ని గదుల్లోకి పంపించింది.


ఆతర్వాత తాను అంతకు ముందురోజు తెచ్చుకున్న పెట్రోలు అత్త మీద పోసి నిప్పంటించింది. అత్త అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా.. టీవీ సౌండ్‌ పెద్దగా పెట్టింది. మంటలకు కనకమహాలక్ష్మి కాళ్లు, చేతులకు కట్టిన కట్లు కాలిపోయాయి. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపు పరుగులు తీసింది. అక్కడే ఉన్న మనవరాలికి కూడా మంటలు అంటుకుని.. పాప కాళ్లు, చేతులు కాలిపోయాయి. టీవీ వైర్లు తగిలి, నానమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది. కనకమహాలక్ష్మి కేకలు విన్న లలిత తల్లి బాత్‌రూంలో నుంచి బయటకు వచ్చి చూసింది. కానీ, అప్పటికే ఆమె చనిపోయింది.


కరెంట్ షాక్ వల్లే అత్త చనిపోయిందని స్థానికులకు చెప్పిన లలిత.. పోలీసులకు మాత్రం.. దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకుని కాలిపోయిందని చెప్పింది. దీంతో లలితపై పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాక కనకమహాలక్ష్మి కాలిపోతుండటాన్ని ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే లలిత ఇంటికి వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా లలిత అతడిని అడ్డుకుంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది.


శుక్రవారం రాత్రి వరకు పోలీసులు.. పలు కోణాల్లో లలితను విచారించారు. ఆమె ఫోన్‌ తీసుకుని పరిశీలించగా యూట్యూబ్‌లో హౌ టు కిల్‌ ఓల్డ్‌ లేడీ అని వెతికి, వీడియోలు చూసినట్లు పోలీసులకు తెలిసింది. చివరకు అత్తను తానే హత్య చేసినట్లు లలిత నేరాన్ని అంగీకరించింది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించేదని.. తన మీద భర్తకు చాడీలు చెప్పదనే.. వాటిని జీర్ణించుకోలేకనే ఇలా చేశానని వెల్లడించింది. పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa