ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2742 కోట్ల కుంభకోణం.. సుప్రీంలో దీదీపై ఈడీ సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 08:28 PM

ఐ ప్యాక్ సంస్థపై దాడుల విషయంలో దీదీ సర్కార్, ఈడీ మధ్య యుద్ధం సుప్రీంకోర్టుకు చేరింది. రూ.2742 కోట్ల బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో తాము చేస్తున్న దర్యాప్తును అడ్డుకుని మమతా బెనర్జీ సాక్ష్యాలను మాయం చేశారని ఈడీ సంచలన ఆరోపణలు చేయగా.. ఇది మోదీ సర్కార్ చేస్తున్న రాజకీయ కుట్ర అని టీఎంసీ వాదిస్తోంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.


రూ.2742 కోట్ల కుంభకోణం.. సుప్రీంలో దీదీపై ఈడీ సంచలన ఆరోపణలు.. ఐప్యాక్‌పై దాడుల కేసు(ఫోటోలు- Samayam Telugu)


అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐ ప్యాక్ కార్యాలయాలపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులు.. ఆపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని.. ఫైల్స్ జోక్యం చేసుకుని ఫైల్స్ తీసుకెళ్లడం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌లో మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు.


జనవరి 8వ తేదీన ఐ ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతుండగా.. మమతా బెనర్జీ 200 మంది పోలీసులతో వచ్చి తమ అధికారులను అడ్డుకున్నారని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లను సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపించింది. ఈడీ అధికారులను బెదిరించి.. సుమారు రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని.. ఇది తాము చేస్తున్న దర్యాప్తును నీరుగార్చడమేనని ఫిర్యాదు చేసింది.


 అయితే ఈడీ చేస్తున్న దాడులపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను వాడుకుంటోందని దీదీ ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ పార్టీ పత్రాలను, డేటాను దొంగిలిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియకు.. ఈ ఈడీ దాడులకు సంబంధం ఉందని మమత బెనర్జీ ఆరోపించారు.


కోల్‌కతా హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుండగా సీఎం మద్దతుదారులు కోర్టులో గందరగోళం సృష్టించారని.. అందుకే నిష్పాక్షిక విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఈడీ తెలిపింది. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈడీ అధికారులపై నమోదైన పోలీసు కేసులపై స్టే విధించాలని, స్వాధీనం చేసుకున్న డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa