ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘా అనుబంధ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా,,,,,ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 06:52 PM

వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి ఆయనెవరో గుర్తు రాకపోవచ్చు. కానీ జేడీ లక్ష్మీనారాయణ అంటే చాలు ఠక్కున గుర్తుపడతారు. సీబీఐ అధికారిగా జగన్ అక్రమాస్తుల కేసు సహా అనేక హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేయడంతో ఆయన పేరు అప్పట్లో మార్మోగింది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వీవీ లక్ష్మీనారాయణ .. ముంబైలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2023లో జై భారత్ నేషనల్ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టారు. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో ఆయన పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేశారు. ఆయన కుమారుడు కూడా ఆలిండియా సర్వీసులో పని చేస్తున్నారు.


జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఓ ఉన్నత ఉద్యోగంలో చేరారు. ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన చేరారు. ఈవీ ట్రాన్స్ అనేది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ( మెయిల్)కు అనుబంధ సంస్థ. ఐపీఎస్ అధికారిగా దాదాపు మూడు దశాబ్దాలపాటు సుదీర్ఘ సేవలు అందించిన జేడీ లక్ష్మీనారాయణను ఈవీట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా తీసుకోవడానికి కారణం ఉంది.


జేడీ లక్ష్మీనారాయణ ఎన్ఐటీ వరంగల్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివారు. అనంతరం ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అశోక్ లేల్యాండ్ ఆర్ అండ్ డీ విభాగంలో కెరీర్ మొదలుపెట్టారు. ఆ సమయంలో కమర్షియల్ వెహికల్ సిస్టమ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్స్ మీద ఆయన అనుభవం సంపాదించారు.


ఈవీట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ అనుభవం, కార్య దక్షత తమకు ఉపకరిస్తాయని ఆ సంస్థ భావిస్తోంది. లక్ష్మీనారాయణ నియామకం విషయాన్ని ఈవీట్రాన్స్ సంస్థ లింక్డ్ఇన్ ద్వారా స్వయంగా వెల్లడించింది. 2006-13 మధ్య డిప్యూటేషన్ మీద సీబీఐకి వెళ్లిన లక్ష్మీనారాయణ.. జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని.. ఈ సమయంలో ఆయన అనేక హైప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారని కూడా ఈవీట్రాన్స్ గుర్తు చేసింది.


తెలంగాణ ఆర్టీసీలో నడుస్తోన్న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ఈ సంస్థే తయారు చేసింది. ఒక్క తెలంగాణ ఆర్టీసీనే కాకుండా.. ముంబై, పుణే, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈవీట్రాన్స్.. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్‌గా అవతరించింది.


ఇదిలా ఉండగా.. లక్ష్మీనారాయణ భార్య ఇటీవల ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లో రూ.2.58 కోట్లు మోసపోయిన సంగతి తెలిసిందే. ట్రేడింగ్ నిపుణులమని పరిచయం చేసుకొని.. భారీ లాభాలు ఆశచూపిన స్కామర్లు ఊర్మిళను మోసం చేశారు. దీంతో లక్ష్మీనారాయణ దంపతులు జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa