ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుళ్ల వేషధారణలో దొంగతనాలు,,,,నలుగుర్ని అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 07:43 PM

కోల్‌కతా పోలీసులు రీసెంట్‌గా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో.. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. రెగ్యులర్ దొంగలతో పోలిస్తే వీళ్లది కాస్త డిఫరెంట్ స్టయిల్. వీరు కాళీ మాత, మహా శివుడు మొదలైన హిందూ దేవుళ్ల వేషాలు వేసుకొని రోడ్ల మీద తిరిగేవారు. ఈ క్రమంలో కాస్త భక్తిభావం ఉన్నవారు వీరికి తమకు తోచినంత చిల్లర డబ్బులు ఇచ్చేవారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఎదుటి వారిలో భక్తిభావం మెండుగా ఉందనిపిస్తే.. వారితో మాటలు కలిపి.. చాకచాక్యంగా వాళ్ల దగ్గర్నుంచి ఫోన్లు, పర్సులు కొట్టేసేవారు.


‘‘మీరు రోడ్డు దాటడం కోసం ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నారని అనుకుందాం. కాళీ మాత, శివుడి, ఇతర దేవుళ్ల వేషధారణలో ఉన్నవారు మీ దగ్గరకొస్తే.. వారిని చూసి మైమర్చిపోకండి. వాళ్లు కూడా దేవతా వస్త్రధారణలో ఉన్న మామూలు మనుషులే అని గుర్తించండి. మీ దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవాలనేది వారి ఉద్దేశం. నగరంలో ఇది సాధారణంగా జరిగే వ్యవహారమే. కొంత సేపు మాట్లాడిన తర్వాత మతం గురించి, ఆధ్యాత్మిక గురించి నాలుగు మాటలు చెప్పాక.. మీరు వారికి కొంత డబ్బు ఇస్తారు. కానీ ఆ దేవదేవుళ్లు వెళ్లిపోయిన తర్వాత మీ పర్సు లేదా ఫోన్ మాయమైందని మీరు గుర్తిస్తారు. తమ చాకచక్యంతో దొంగలు ఇలా చోరీలకు పాల్పడుతున్నారు’’ అని కోల్‌కతా పోలీసులు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.


తమ వస్తువులు చోరీకి గురయ్యాయని జోరాసంకో పోలీస్ స్టేషన్లో ఎవరో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దేవుళ్ల వేషాలు వేసుకొని డబ్బులు అడుగుతున్న వారే.. బాధితుల దృష్టిని మళ్లించి వారి దగ్గర్నుంచి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. హేస్టింగ్స్ ఏరియాలో అనిల్ రాంజు సలాత్ ధీరు కలోవయ్ సలాత్, సమీర్‌భాయ్ సలాత్, రాజ్ కుమార్ అనే నలుగుర్ని పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురూ గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.


ఈ గ్యాంగ్ కేవలం కోల్‌కతాలోనే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనాలు బయటపడటం కూడా కాస్త విచిత్రంగానే జరిగింది. గిరిష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ చోరీ కేసు నమోదైంది. ఈ కేసులో మహ్మ్ షహనావాజ్, మహ్మద్ సమీర్ అనే ఇద్దరు నిందితులను పార్క్ స్ట్రీట్ ఏరియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లను విచారిస్తున్న క్రమంలో దేవుళ్ల వస్త్రధారణలో చోరీలు చేస్తున్న ముఠా గురించి తెలిసింది. రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడళ్లు, ఫెయిర్‌లు, జనసమ్మర్థంతో ఉండే బహిరంగ ప్రదేశాలను ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకునేదని పోలీసులు చెప్పారు. ఇది పెద్ద నెట్‌వర్క్‌లా ఉందని.. విచారణ ఇంకా ముగియలేదని కోల‌కతా పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa