ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ రైలులో పామును వదిలేసిన వ్యక్తి.... 6 వారాల తర్వాత నిందితుడి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 07:47 PM

మన దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలు అందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ.. వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కొంతమంది ప్రయాణికులు.. వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైలును చెత్తకుప్పల్లాగా మార్చిన వీడియోలు ఇటీవలి కాలంలో మనం చాలా చూశాం. రైళ్లలో డస్ట్‌ బిన్‌లు ఏర్పాటు చేసినప్పటికీ.. కొందరు ప్రయాణికులు.. సీట్లపై, నడిచే స్థలంలో చెత్త వేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఓ సంఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.


కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని ముంబై-సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వాష్‌రూమ్‌లో పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఘటన వెలుగు చూసిన దాదాపు ఆరు వారాల తర్వాత.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసులు.. 37 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడిని నాసిక్ జిల్లాకు చెందిన జగన్ అర్జున్ భాలేగా గుర్తించారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వాష్‌రూంలో జగన్ అర్జున్ భాలే పామును వదిలేసినట్లు అధికారులు.. ఆ రైలులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.


అయితే పాము కనిపించిన తర్వాత విచారణ చేపట్టిన ఆర్పీఎఫ్ పోలీసులు.. ఆ కోచ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని గుర్తించి అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12వ తేదీన ముంబ్రాలో జగన్ అర్జున్ భాలేను అరెస్టు చేశారు. ఇక ఆ పామును వాష్‌రూంలో గుర్తించిన తర్వాత.. ఆ రైలు సోలాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం.. స్నేక్ క్యాచర్ ద్వారా పామును సురక్షితంగా పట్టుకున్నారు.


సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 27వ తేదీన రైలు నంబర్ 22225 (ముంబై-సోలాపూర్ వందే భారత్ స్లీపర్ రైలు) లోని కోచ్ సీ-16 టాయిలెట్‌లో నిందితుడు పామును ఉంచుతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలిపారు. ఆ సీసీటీవీ ఫుటేజీ కారణంగానే నిందితుడు జగన్ అర్జున్ భాలేను గుర్తించి పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు.


  ఇక నిందితుడు జగన్ అర్జున్ భాలేను కళ్యాణ్‌ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడికి 14 రోజుల మెజిస్టీరియల్ కస్టడీ రిమాండ్ విధించింది. మరోవైపు.. కోర్టులో జరిగిన విచారణలో తన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa