అంత్యక్రియలు నిర్వహణలో దహనం, ఖననం వంటి సంప్రదాయ విధానాలతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ పద్ధతిలోనూ అంతిమ సంస్కారాలను చాలా ప్రాంతాల్లో అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నీటితో అంత్యక్రియలు’ నిర్వహించే పర్యావరణ హితమైన విధానానికి యునైటెడ్ కింగ్డమ్ అనుమతించింది. కాలుష్యరహిత ఈ రెసోమేషన్ ను త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది.
నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే విధానాన్ని రెసోమేషన్ అంటారు. ఎటువంటి మంటలు ఉపయోగించని ఈ ప్రక్రియలో పొటాషియం హైడ్రాక్సైడ్, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేస్తారు. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్ బ్యాగులో చుట్టిన తర్వాత 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్ ఇన్ ది బ్యాగ్’గా వ్యవహరిస్తారు. అనంతరం 160 డిగ్రీ ఉష్ణోగ్రత వరకూ వేడి చేస్తారు. ఇందులో జరిగే రసాయన చర్య కారణంగా కొన్ని ద్రవాలు బయటకు వచ్చి... అస్థి పంజరంలోని ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు.
ఈ పద్ధతిలో అంత్యక్రియలకు నాలుగు గంటల సమయం పడుతుంది. కానీ, ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ దీని ద్వారా విడుదల కావు. అక్వామేషన్, ఆల్కలైన్ హైడ్రాలసిస్ అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షిత విధానంగా పరిశోధకులు చెబుతున్నారు. సహజ కణజాలాలు, కొవ్వులు కరిగిపోయేలా చేస్తుంది. సాధారణంగా ఖననం చేసిన మృతదేహాం సహజంగా కుళ్ళిపోయే ప్రక్రియ 12 సంవత్సరాల వరకు పడుతుంది. కానీ, ఇది 14 గంటల్లోనే పూర్తవుతుంది.
ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికాతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. తాజాగా, బ్రిటన్ కూడా ఈ జాబితాలో చేరనుంది. బ్రిటన్కు చెందిన ‘కో-ఆప్ ఫ్యూనెరల్ కేర్’ అనే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ దీని గురించి మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూడో వంతు తక్కువగా ఉద్గారాలు విడుదలవుతాయని పేర్కొంది. అంతేకాదు, దీని ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియల మాదిరిగానే ఉంటుందని తెలిపింది.
ఈ విధానాన్ని ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రారంభిస్తున్నామని.. మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ‘కో-ఆప్ ఫ్యూనెరల్ కేర్’ పేర్కొంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులైన దహన, ఖనన విధానాలకు ప్రత్యామ్నాయం ఇదేనని అంటున్నారు. వాస్తవానికి 2009లోనే యూకేలో మొదటి రెసోమేషన్ను స్కాట్లాండ్ బయో-కెమిస్ట్ శాండీ సుల్లీవన్ నిర్మించారు.
సాధారణంగా ఓ దహన ప్రక్రియలో 245 కిలోల కార్బన్ విడుదలవుతుంది. ఇలా బ్రిటన్లో వందల టన్నుల వాయువులు విడుదల అవుతున్నట్లు దహన సంస్కారాలు నిర్వహించే సీడీఎస్ అనే సంస్థ వెల్లడించింది. సామాజిక శాస్త్రవేత్త, బాత్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డెత్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కేట్ వుడ్థోర్ప్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నిండిపోయిన శ్మశానవాటికలపై ఆధారపడటం, పరిమిత వనరులను ఉపయోగించుకునే గ్యాస్ శ్మశానవాటికలతో మనం ఉన్న విధంగా కొనసాగలేం’ అన్నారు. విక్టోరియన్ కాలం నాటి చట్టం లండన్ వెలుపల చాలా ప్రదేశాలలో శ్మశాన వాటికను పునర్నిర్మించడాన్ని నిలిపివేసినందున ఖననం చేయడానికి స్థల సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa