ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీ అలర్ట్.. కౌంటింగ్ రోజున ఈ జిల్లాల్లో భారీ వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 11:13 PM

ఏపీవాసులకు శుభవార్త.. వేసవికాలంలో ఉక్కబోతతో ఇబ్బందిపడిన ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు వాతావరణశాఖ చెప్పిన దానికంటే ముందే ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది.


నైరుతి రుతుపవనాల రాకతో మంగళవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.


మరోవైపు రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో వానాకాలం ప్రారంభమైందని చెప్పొచ్చు. దీంతో ఎండాకాలంలో తీవ్రమైన ఉక్కబోత, ఎండవేడిమితో ఇబ్బందులు పడిన ప్రజలు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు ఎండాకాలం నుంచి వానాకాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో.. సీజన్ మారే సమయంలో వచ్చే జబ్బులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa