రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల వారీగా మిషన్ అంత్యోదయ సర్వే మరియు గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి-2020-21)రూపకల్పనకై అక్టోబరు 2వతేదీ నుండి డిశంబరు 31వతేదీ వరకూ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్(సబ్ కీ యోజన-సబ్ కా వికాస్)కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.గురువారం అమరావతి సచివాలయంలో గ్రామ పంచాయితీ డెవలప్మెంట్ ప్రణాళిక(జిపిడిపి-2020-21)అంశంపై పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మట్లాడుతూ రాజ్యాంగంలోని 243జి నిబంధన ప్రకారం ఆయా గ్రామపంచాయితీ ప్రజల ఆర్ధికాభివృద్ధి, సామాజిక న్యాయానికై గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికరూపొందించడం తప్పనిసరని కేంద్ర పంచాయితీరాజ్ శాఖ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన అనేది కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంబంధిత లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించి అమలు చేస్తున్న అన్ని పధకాలు, కార్యక్రమాలు కన్వర్జెన్స్ తో రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాదికి అనగా 2020-21కి సంబంధించి గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకై అక్టోబరు 2 నుండి డిశంబరు 31 ఈపీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ను అన్ని గ్రామ పంచాయితీలు చేపట్టాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు.ఈప్రక్రియను అంతటినీ పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ,స్థానిక సంస్థల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందని సిఎస్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa