ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు లక్ష్యాలపై దృష్టి పెట్టండి…

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 08:31 PM

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు మంచి ధరలు ఇప్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఏర్పడిన జీసీసీ అసలు లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించాలని పుష్ప శ్రీవాణి హితవు చెప్పారు. పెట్రోల్ బంకుల నిర్వహణ, గ్యాస్ సరఫరా లాంటి వాటిపై  ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా గిరిజనులకు వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు వాల్యూయాడ్ చేసే కార్యక్రమాల్లో శిక్షణలు ఇవ్వాలని, గిరిజనులకు మరింత చేరువై వారి జీవన ప్రమాణాలను పెంచేలా పథకాలను రూపొందించాలని కోరారు. అటవీ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విక్రయించడం ద్వారా వాటికి మంచి ధర పలుకుతుందని అందుకే వీలైనంత ఎక్కువగా ప్రాసెసింగ్ కేంద్రాలను అన్ని ఉత్పత్తులకూ, అన్ని చోట్లా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జీసీసీలో రూ.343 కోట్ల టర్నోవర్ కు కేవలం రూ.10 కోట్ల లాభం అన్నది సంతృప్తికరంగా లేదన్నారు. జీసీసీ విక్రయించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది వ్యాపారులు వచ్చేలా చూడాలని తద్వారా కూడా వాటికి మంచి ధర రావడానికి అవకాశం ఉందన్నారు.  బ్రాండింగ్ పేరుతో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా అరకు కాఫీకి రావాల్సినంత పేరు రాలేదని చెప్పారు. అరకు కాఫీకి మరింతగా ప్రచారం కల్పించి, దేశ వ్యాప్తంగా విక్రయాలు చేపట్టాలన్నారు. అయితే జీసీసీ ఉత్పత్తులు ప్రజల్లోకి బాగా వెళ్లాలంటే రిటైల్ వ్యాపారాన్ని భారీగా పెంచుకోవాలని, అబిప్రాయపడ్డారు. అలాగే మార్కెట్ ధరలకంటే ఎక్కువ ధరలకు వస్తువులను అమ్మకానికి పెడితే వాటిని ఎవరూ కొనుగోలు చేయరని గుర్తించాలని కోరారు. నష్టాలు వస్తున్న చోట అరకు కాఫీ షాపులను, పెట్రోల్ బంకులను కొనసాగించే విషయంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. కన్సల్టెంట్లు, ఓఎస్డీల పేరుతో జీసీసీ లో పని చేస్తున్న వారిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి అవసరం సంస్థలో ఉందా, లేదా అన్నది కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో గిరిజనుల నుంచి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తులను ఏ డివిజన్ కు ఆ డివిజన్ లోనే విక్రయించడం జరిగేదని గుర్తు చేసారు. అయితే ప్రస్తుతం విక్రయాలను సెంట్రలైజ్ చేసి ఎక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులనైనా వైజాగ్ లోని సెంట్రల్ గోదాములకు తరలించాలనే పద్ధతి పెట్టిన కారణంగా రవాణా భారం పెరిగిపోవడంతో పాటుగా కోట్ల రుపాయల ఉత్పత్తులు  అమ్ముడుపోకుండా గోదాముల్లో నిల్వ ఉండిపోతున్నాయని చెప్పారు. ఈ విధానాన్ని సమీక్షించి మళ్లీ పాత విధానంలోనే అమ్మకాలను సాగించాలని సూచించారు. ఈ అంశాలు తన దృష్టిలోనూ ఉన్నాయని  దీనిపై చర్యలు తీసుకుంటామని శోభ పేర్కొన్నారు. సమావేశంలో జీసీసీ జి.ఎం.లు జోగేశ్వర్ రావు, అశోక్ కుమార్, డిజిఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa