ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మద్యం వలన అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం 450 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో 3500 షాపులను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీటిని నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలను చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్ పంపాము. మహిళలు, ప్రతిపక్షం వారు కూడా మద్య విధానానికి, దశలవారీ మద్య నిషేధానికి సహకరించాలి. బెల్టు షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాధి కోసం కలెక్టర్లతో మాట్లాడాము. ధరల విషయంలో త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాము. బార్ షాపుల సమయంపై కూడా చర్చిస్తున్నాము. త్వరలోనే కచ్చితంగా సమయం కుదింపు ఉంటుంది. బెల్టు షాపులు పెట్టకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. మహిళలు ఖచ్చితంగా వచ్చి మాకు మద్యం దుకాణం వద్దంటే అక్కడ వాస్తవ పరిస్తితులకు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa