దేశఉత్తర సరిహద్దులో చైనా కుట్రలకు పాల్పడుతూ కయ్యానికి కాలుదూస్తోన్నవేళ.. వాయువ్యంలోని పాకిస్తాన్ సైతం సైతాను క్రియలను పున:ప్రారంభించింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భారీగా సైన్యాన్ని పోగుచేస్తూ, యుద్ధసంకేతాలు పంపుతుండగా... నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి శిబిరాల్లో టెర్రరిస్టులను ట్రైన్ చేసిన పాకిస్తాన్.. ఆ ముష్కరులకు భారత్ పైకి ఉసిగొల్పేందుకు రెడీ అవుతోంది. దుష్టపన్నాగాలకు సంబంధించి భారత ఆర్మీ ఆదివారం కీలక ప్రకటన చేసింది.
వేసవి అనుకూలత.
మిగతా సీజన్లలో దుర్బేధ్యంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో.. వేసవిలో మాత్రం కొంత అనుకూలత ఏర్పడుతుంది. దీన్ని అవకాశంగా మలుచుకుని పాకిస్తాన్ పెద్ద ఎత్తున టెర్రరిస్టుల్ని ఇండియాలోకి డంప్ చేసేందుకు సిద్ధమైనట్లు లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని ఉగ్రశిబిరాలు, చొరబాటు స్థావరాలు టెర్రరిస్టులతో కిక్కిరిసిపోయి ఉన్నారని, రాబోయే రెండు నెలలు చొరబాట్లు అధికంగా ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతీకార దాడులు
భారత్ ను అస్థిరపర్చడంలో భాగంగా పాకిస్తాన్ సుదీర్ఘకాలంగా టెర్రరిస్టులను పంపుతూ పరోక్ష యుద్ధం చేస్తుండటం తెలిసిందే. అయితే, జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేత తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్తాన్ కు అనుకూలంగా పనిచేసే లోకల్ టెర్రరిస్టుల్ని.. బలగాలు ఎన్ కౌంటర్లలో అంతం చేశాయని లెఫ్టినెంట్ రాజు గుర్తుచేశారు. తోటి టెర్రరిస్టుల మరణాలకు ప్రతీకారంగా, వారి స్థానాలను భర్తీ చేసేందుకు పాక్ వైపు నుంచి ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే యత్నాలు పెరగొచ్చని ఆయన తెలిపారు.
ఒక్కణ్ని కూడా దాటనీయం.
‘‘ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్లీ ముమ్మరం చేసింది. శిక్షణా శిబిరాలతోపాటు సుమారు 15 లాంచ్ ప్యాడ్లలో టెర్రరిస్టులు రెడీగా ఉన్నట్లు గుర్తించాం. పాకిస్థాన్ సైన్యం సాయంతో వాళ్లు భారత్ లోకి చొరబడేందుకు ప్రణాళికలు చేశారు. వాళ్లలో ఒక్క టెర్రరిస్టును కూడా భారత గడ్డపై అడుగుపెట్టనీయకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లోని బలగాలను సంయమనం చేస్తూ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ (సీఐజీ)ను రూపొందించాం''అని లెఫ్టినెంట్ జనరల్ రాజు వ్యాఖ్యానించారు.
పాక్ కుతకుత..
జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, భారత్ లో పూర్తిగా విలీనం చేసిన తర్వాత అక్కడి ప్రజలు నిజమైన శాంతి, స్వతంత్రాలను అనుభవిస్తున్నారని, జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర కార్ఖానాలు ఒక్కొక్కటిగా మూతపడటంతో పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నదని లెఫ్టినెంట్ జనరల్ బీవీ రాజు అన్నారు. గతంలో కంటే కశ్మీర్ లోయలో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితి మరింత మెరుగు పడిందన్న ఆయన.. భారత్ వ్యతిరేక కార్యకలాపాలను, సీమాంతర చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa