డిజిటల్ విప్లవం తర్వాత అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పూర్తిగా ఆన్లైన్కు మారాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వచ్చే ఈ-చలాన్లు కూడా ఇప్పుడు నేరుగా మొబైల్ ఫోన్కు చేరుతున్నాయి. అయితే ఇదే సౌకర్యాన్ని సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. హైదరాబాద్, పూణే వంటి ప్రధాన నగరాల్లో వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకుని ‘నకిలీ RTO ఈ-చలాన్’ స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. చలాన్ చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని బెదిరిస్తూ వచ్చే ఈ మెసేజ్లను ఓపెన్ చేస్తే, బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్కామ్లో భాగంగా, నేరగాళ్లు ప్రభుత్వ అధికారిక ట్రాఫిక్ చలాన్ నోటీసును పోలి ఉండే మెసేజ్ను మొబైల్కు పంపించి, మీరు సిగ్నల్ జంప్ చేశారని లేదా ఓవర్ స్పీడ్తో వెళ్లారని పేర్కొంటూ వెంటనే చలాన్ కట్టాలని ఒత్తిడి చేస్తారు. ఆ మెసేజ్కు లింక్ లేదా APK ఫైల్ను జత చేసి, ఆలస్యం చేస్తే భారీ జరిమానా పడుతుందని భయపెడతారు. భయంతో చాలామంది ఆ లింక్ను క్లిక్ చేయగానే లేదా ఫైల్ను డౌన్లోడ్ చేయగానే, ఫోన్పై సైబర్ నేరగాళ్లకు రిమోట్ యాక్సెస్ లభిస్తుంది. సైబర్ పోలీసుల దర్యాప్తులో, ‘RTO Traffic Challan’ పేరుతో వాట్సాప్ ద్వారా మాల్వేర్ ఫైళ్లను పంపిస్తున్నట్లు తేలింది. ఆ ఫైల్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఫోన్లోని కాంటాక్ట్స్, మెసేజ్లు, బ్యాంకింగ్ యాప్స్, గ్యాలరీ వంటి కీలక సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. బ్యాంక్ లావాదేవీల సమయంలో వచ్చే OTPలను కూడా బాధితులకు తెలియకుండా వారు చదివేస్తారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం లేదా బ్యాంక్ సెలవుల రోజుల్లోనే ఈ తరహా మెసేజ్లు ఎక్కువగా పంపుతారని పోలీసులు చెబుతున్నారు, ఎందుకంటే ఆ సమయంలో బ్యాంక్ హెల్ప్లైన్లు లేదా పోలీసుల సహాయం వెంటనే అందుబాటులో ఉండదు. పూణేలో ఓ వ్యక్తి రూ.5 లక్షలు, చించ్వాడ్లో మరో వ్యక్తి రూ.2.49 లక్షలు ఇలా కోల్పోయిన ఘటనలు ఇప్పటికే నమోదయ్యాయి. అందువల్ల ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్లు, లింకులు లేదా ఫైళ్లకు దూరంగా ఉండటం అత్యంత అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa