ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వీడేవారికి రూ. 2.7 లక్షలు.. ఫ్రీగా విమాన టికెట్లు,,,ట్రంప్ ఆఫర్

international |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 10:17 PM

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. స్వయంగా స్వదేశాలకు వెళ్లేవారికి ఇప్పటికే నగదు ఆఫర్ చేసింది. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా అక్రమ వలసదారులకు మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లేవారికి 3 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.2.7 లక్షలు అందించనుంది. అంతేకాకుండా అలా వెళ్లిపోయే వారికి అమెరికా ప్రభుత్వమే విమాన టికెట్లకు ఛార్జీలు కూడా భరించనుంది.


అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ప్రోత్సహించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సరికొత్త హాలీడే ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లడానికి అంగీకరించే వారికి రూ. 2.7 లక్షల నగదుతో పాటు.. ఫ్రీగా విమాన టికెట్లు అందజేయనుంది. ఈ అవకాశాన్ని వదులుకుంటే వారిని అరెస్ట్ చేసి.. శాశ్వతంగా అమెరికా రాకుండా నిషేధం విధిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది.


డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా దేశం నుంచి బహిష్కరించడం కంటే స్వచ్ఛందంగా వారిని వెనక్కి పంపించడమే ఆర్థికంగా లాభమని భావించి ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. గతంలో అమెరికా నుంచి వెళ్లే వలసదారులకు 1000 డాలర్లు అంటే రూ.90 వేలు ఇస్తుండగా., దాన్ని ఇప్పుడు 3 వేల డాలర్లు రూ.2.7 లక్షలకు పెంచింది. స్వదేశానికి వెళ్లేందుకు వన్ వే విమాన టికెట్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉన్నందుకు విధించే సివిల్ జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేస్తారు.


ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు CBP Home అనే మొబైల్ యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి CBP Home యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, దేశం, ఒక సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు.. నేరుగా సంప్రదించి ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు. వారు తమ స్వదేశానికి చేరుకున్నట్లు యాప్ ద్వారా ధృవీకరించిన తర్వాత 3 వేల డాలర్ల నగదు అందుతుంది.


ఈ పథకంపై స్పందించిన హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు అందించే ఉత్తమ క్రిస్మస్ గిఫ్ట్ ఇదేనని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. అలాంటి వారిని తాము వెతికి పట్టుకుని.. అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని.. ఆ తర్వాత వారు జీవితంలో తిరిగి మళ్లీ అమెరికాలో అడుగుపెట్టలేరని హెచ్చరించారు.


ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. ఒక్కొక్కరిని బలవంతంగా అరెస్టు చేసి పంపించాలంటే ప్రభుత్వానికి సగటున 17 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.15 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. ఈ స్వచ్ఛంద పథకం ద్వారా ఆ ఖర్చును 70 శాతం వరకు తగ్గించవచ్చని అమెరికా హోం ల్యాండ్ అధికారులు భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa