కరోనా లో బ్రిటన్ వెరియంట్ ఎలా అయితే మన దేశం లో తన ఎఫెక్ట్ చూపించిందో అలాగే బ్రిటన్ లో బయటపడిన ఇండియన్ వేరియంట్ అక్కడ సినిమా చూపించింది.. దీంతో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ను ఆ దేశ ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చింది. ఇండియాలో తొలిసారి బయటపడిన కరోనా వేరియంట్కు సంబంధించిన 103 కేసులు బ్రిటన్లో గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం యూకే రావడానికి ముందు ఇండియాలో పది రోజులు ఉన్న యూకే, ఐరిష్, బ్రిటన్ జాతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు హోటల్ క్వారంటైన్లో ఉండాలి. ఈ నెల 24 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడంతో మన దేశం నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజా కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి భారత్ను రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ సోమవారం తెలిపారు.
భారత్లో కరోనా కేసుల పెరుగుదల, వందల సంఖ్యలో వేరియంట్ల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చాల్సి వచ్చిందని పార్లమెంట్కు తెలిపారు. ఈ రెడ్లిస్ట్లో భారత్తో కలిపి 40 దేశాలు ఉన్నాయి. హాంకాంగ్ కూడా మంగళవారం ఏప్రిల్ 20 నుంచి మే 3 దాకా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధించింది. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ ప్రయాణికులపైనా కూడా నిషేధం విధించింది.ఇప్పటికే ఏప్రిల్ 11 నుంచి 28 దాకా భారత్ నుంచి ప్రయాణికుల రాకపై న్యూజిలాండ్ నిషేధం విధించింది.
ఒకవేళ భారత్లో పరిస్థితి కుదుటపడి, కోవిడ్ నియంత్రణలోకి వస్తే జీ7 కూటమి సమావేశాలకు ముందే బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించవచ్చని,ఇరువురి నేతల వర్చువల్ సమావేశం తర్వాత దీనిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని భారత దౌత్యాధికారి ఒకరు పేర్కొన్నారు.
ఏప్రిల్ 26న జాన్సన్ భారత్కు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపాలని జాన్సన్ తొలుత భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పర్యటన క్షేమకరం కాదని ప్రతిపక్షాలు సహా ఇతర వర్గాలు సూచించడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెలాఖరులో మోదీతో వర్చువల్ విధానంలో జాన్సన్ సమావేశమవుతారు. భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల మెరుగుదల కోసం ఉద్దేశించిన 'రోడ్ మ్యాప్ 2030'పై ఇరువురు నేతలు చర్చిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa