న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,693 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3502 మంది కరోనాతో మృతిచెందారు. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 మంది కరోనా బారినపడగా, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక న్యూఢిల్లీలో 24,235 మందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అవుతున్నారు.
కాగా, దేశంలో ఈ ఏడాదిలో మొదటిసారిగా రోజువారీ కేసులు లక్షకుపైగా కేసులు ఏప్రిల్ 6న నమోదయ్యాయి. నెల చివరినాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉన్నది. ఈనెల 6న 1.15 లక్షల కేసులు నమోదవగా, ఏప్రిల్ 13న వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. అదేవిధంగా ఏప్రిల్ 15 నాటికి రోజువారీ కేసులు 2 మార్కును దాటగా, ఈ నెల 20న మరణాల సంఖ్య 2 వేలకు చేరింది. కేవలం ఆరు, ఏడు రోజుల్లోనే రోజువారీ కేసులు 3 లక్షలు, మరణాలు 3 వేలు దాటాయి. ఏప్రిల్ 21న 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఏప్రిల్ 27న మూడువేల కంటే ఎక్కువగా మరణాలు రికార్డయ్యాయి. దీనినిబట్టి ముందుముందు రోజువారీ కేసులతోపాటు, మరణాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa