ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంపై చైనా డేగకన్ను...అందుకోసం ఏకంగా ఇన్ని ఉపగ్రహాలు

international |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:10 AM

ప్రపంచంపై ఆధిపత్యం చలాయించేందుకు తహతహలాడుతున్న చైనా దేశం అనేక కుట్రలకు పాల్పడుతోందన్న ఆరోపణలు మళ్లీ మొదలయ్యాయి. అమెరికా, దాని మిత్రపక్షాలు సహా పలు దేశాలపై చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దాదాపు 13,000 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు రూపొందింస్తుందనే నివేదికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ భారీ ఉపగ్రహ మండలి భూమి దిగువ కక్ష్య మొత్తం ఆవరించి ఉంటుందని, దీని అసలు లక్ష్యం భూమి దిగువ కక్ష్యపై ఆధిపత్యాన్ని సాధించడమేనని తెలుస్తోంది. సుమారు 13,000 ఉపగ్రహాల ఏర్పాటు బాధ్యతను చైనా ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. భూమి దిగువ కక్ష్యపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ భద్రత కోసం శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక ప్రభుత్వ పరిపాలన (SASTIND) విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్న ఉపగ్రహాల అభివృద్ధికి పిలుపునిచ్చింది. ఈ ఉపగ్రహ మండలి (మెగా కాన్‌స్టలేషన్) భూమిపై అత్యధిక భాగంలో నిఘా కార్యకలాపాలతోపాటు, ఇంటర్నెట్ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తుంది. SASTIND వాదనల ప్రకారం.. 5G బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను పటిష్టపరచడం, భౌగోళిక కమ్యూనికేషన్ వ్యవస్థను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయడం ఈ మెగా కాన్‌స్టలేషన్ లక్ష్యం. అయితే, SpaceX-Starlink కంపెనీ ఉపగ్రహాల మాదిరిగానే భూమి దిగువ కక్ష్యలో 12,992 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలనేది చైనా ప్లాన్. వీటిలో ఒక్కొక్క ఉపగ్రహం పరిధి భూమి ఉపరితలంపైన 498.89 కిలోమీటర్ల నుంచి 1,144.24 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చాంగ్‌కింగ్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కొన్ని సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు డెయిలీ మెయిల్ కథనం తెలిపింది. స్పేస్‌ఎక్స్ కంపెనీ ఉపగ్రహాలు ప్రస్తుతం 2,000 వరకు పని చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవే అత్యాధునిక ఉపగ్రహాలు. చైనా దాదాపు 13 వేల ఉపగ్రహాల ఏర్పాటు బాధ్యతను ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలిసిన వెంటనే పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమపై గూఢచర్యానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తోందని అమెరికా, దాని మిత్ర పక్షాలు విశ్వసిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. భూ దిగువ కక్ష్యలో రెండు ఉప్రగ్రహాల మండలిని ఏర్పాటుకు స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం 2020లోనే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, తాజా నివేదికలు ప్రకారం ఇప్పటికే కాంట్రాక్ట్‌లను అప్పగించడంతో పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తైవాన్ సమస్య, కరోనావైరస్ తొలినాళ్లలో వాస్తవాలను చైనా కప్పిపుచ్చడం వల్ల అంతర్జాతీయంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాకు గూఢచర్యం కొత్తేమీకాదు. ఇప్పటికే ప్రయోగించిన భూపరిశీలన ఉప్రగగాలు గౌఫెన్ ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ప్రతి కదలికను పరిశీలిస్తోంది. వీటిని సముద్ర విపత్తులు, సముద్ర వాతావరణం, నీటి వనరుల పరిశీలన కోసమే వీటిని ప్రయోగించినట్టు చైనా చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa