చైనా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్తరకం కరోనా వైరస్పై మరింత అధ్యయనం అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలావుంటే దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ (NeoCoV) వైరస్ను గుర్తించినట్టు వుహాన్ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటనతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శుక్రవారం స్పందించింది. చైనా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్తరకం కరోనా వైరస్పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో ‘నియో కోవ్’ ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకోడానికి మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించింది. మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని, మరీ ముఖ్యంగా వన్యప్రాణులని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. జంతువులతో పాటు గబ్బిలాల్లోనూ కరోనా వైరస్ ఎక్కువగా ఉంటుందని, అవి ముఖ్య కేంద్రాలని తెలిపింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే జునోటిక్ వైరస్లను ఎదుర్కోవడంలో తాము అత్యంత చురుగ్గా పనిచేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ పరిశోధన ఫలితాలను పంచుకున్న చైనా శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కొత్తరకం కరోనా వైరస్ ‘నియోకొవ్’తో పెను ప్రమాదం పొంచి ఉందని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కొవిడ్-19తో పోలిస్తే ‘నియో కోవ్’భిన్నమైనదే గాక, ప్రమాదకరమైనదని కూడా చెప్పారు. యాంటీబాడీలు, కొవిడ్- 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని అంటున్నారు. 2012, 2015లో పశ్చిమాసియా దేశాల్లో విజృంభించిన మెర్స్- కోవ్ మాదిరిగా ‘నియో కోవ్’తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. ఇక సార్స్ కోవ్- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తిచెందే వైరస్గా గుర్తించారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్తో కలిసి వుహాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయన ఫలితాలను బయోఆర్షివ్లో ప్రచురించారు. అయితే, ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నియోకోవ్ వైరస్.. పీడీఎఫ్-2180-సీఓవీ రకానికి చెందినదని వుహాన్ సైంటిస్టులను తమ కథనంలో ఉంటికించాయి. ఈ వేరియంట్ కూడా మనుషుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సార్స్-కోవ్-2 రకంతో సరిపోలుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. కరోనా వైరస్లో ఉండే పాథోజెన్కు భిన్నంగా మరింత ప్రమాదకరంగా ఇది పరిణించే అవకాశాలు లేకపోలేదని సైంటిస్టులు అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa