ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయకుండా చంద్రబాబు డైరెక్షన్లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారని మంత్రి పేర్నినాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జరిగే సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశం చేర్చి.. మళ్లీ తొలగించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మంత్రి పేర్నినాని స్పందించారు. విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారని చెప్పారు. అందుకే కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారని అన్నారు. అప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 'గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేకహోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు..' అంటూ పేర్నినాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, జీవీఎల్, సోమువీర్రాజుని ప్రశ్నిస్తున్నానని.. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాపై అప్పుడు ఇచ్చిన మాటను నిలబెడతారా.. చేతులెత్తేశారా..? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టమా.. లేదా అని అడిగారు. ఏపీపై బఠానీ గింజంత చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నేతలు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీదని మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తంచేశారు. హోల్ సేల్గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి ఏం చేశారని నిలదీశారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా పెట్టడం దేశద్రోహమా..? ఎందుకు చంద్రబాబు, జీవీఎల్ పట్టుబట్టి అజెండా నుంచి తీయించేశారని అడిగారు. 'ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయారు..? అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కనకమేడల ఏ కలుగులో దాక్కున్నారు..?అజెండా నుంచి హోదాను తీసేయగానే ఎందుకు బయటికొచ్చారు..?' అంటూ మంత్రి ప్రశ్నల వర్షం కురింపించారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa