దసరా వార్ ముగిసింది. ఈ వార్ లో `సైరా నరసింహారెడ్డి` దే పైచేయి. మెగాస్టార్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సైరా సక్సెస్ ఇచ్చిన హుషారులో గ్యాప్ తీసుకోకుండానే కొత్త సినిమాను పట్టాలెక్కించేసారు. ఆ విషయం పక్కనబెడితే మరో రెండు నెలల్లో క్రిస్మస్ వస్తోంది. దీంతో నలుగురు స్టార్ హీరోలు క్రిస్మస్ వార్ కి రెడీ అవుతున్నారు. ఎలాగైనా క్రిస్మస్ కి భారీ హిట్లు కొట్టి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ స్టార్ లు ఎవరో కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ-మాస్ రాజా రవితేజ- యూత్ స్టార్ నితిన్- సుప్రీమ్ హీరో సాయితేజ్ ఈసారి క్రిస్మస్ హాలీడేస్ ని టార్గెట్ చేసారు. బాలయ్య కథానాయకుడిగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ముందుగా సంక్రాతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ నిర్ణయంలో మార్పులొచ్చాయి. క్రిస్మస్ కి రిలీజ్ డేట్ లాక్ చేసారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అదే నెల 20న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బాలయ్య న్యూ లుక్ పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. టైటిల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రేపే.. మాపో టైటిల్ ప్రకటించనున్నారని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ తో నిరుత్సాహ పడిన నేపథ్యంలో ఈ 105వ సినిమా తో సక్సెస్ కొట్టాలని బాలయ్య కసిమీదున్నాడు. ఇక డిసెంబర్ 20న రవితేజ -వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కకుతోన్న డిస్కోరాజా సాయిధరమ్ -మారుతి కలయికలో తెరకెక్కుతోన్న `ప్రతి రోజు పండగే` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రవితేజకు డిస్కోరాజా సక్సెస్ కీలకమైనది. సాయి తేజ్ కి చిత్రలహరి సక్సెస్ తో ఊరట దక్కినా... దానికి బూస్టింగ్ గా ప్రతి రోజు పండగే సక్సెసవ్వాల్సి ఉంది. అలాగే సరిగ్గా క్రిస్మస్ రోజున నితిన్ `భీష్మ` కూడా రిలీజ్ అవుతోంది. ఇలా ఒకే రోజు మూడు పెద్ద సినిమాలు.. మరో నాలుగు రోజుల వ్యవధిలో `భీష్మ` ప్రేక్షకుల ముందుకు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa