ప్రేమదేశం' .. 1996లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో 'కాదల్ దేశం' పేరుతో విడుదలైన ఈ సినిమా 'ప్రేమదేశం' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కదీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అబ్బాస్ .. వినీత్ .. టబు ప్రధానమైన పాత్రలను పోషించారు. స్నేహాన్ని .. ప్రేమను కలిపి నడిపించడం .. కలిపి చూపించడం ఈ కథలోని ప్రత్యేకత. ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేసింది.
'ముస్తఫా .. ముస్తఫా' .. 'నను నేను మరిచినా' పాటలు ప్రేక్షకుల హృదయాలను ఇప్పటికీ తడుతూనే ఉంటాయి .. అనుభూతులతో తడుపుతూనే ఉంటాయి. బలమైన కథాకథనాలకు .. ఆకట్టుకునే సంగీతం తోడైతే ఎలా ఉంటుందనేది ఈ సినిమా నిరూపించింది. తమిళంలోనే కాదు .. తెలుగులోను ప్రేమకథలు విషయంలో ఈ సినిమా ఒక సరికొత్త ట్రెండును సృష్టించింది. గమ్మత్తు ఏమిటంటే తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందడం. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే కొత్తగా వచ్చిన సినిమాను చూస్తున్న ఫీలింగే కలుగుతుంది.
ఇంతకు ఈ సినిమాను గురించి ఇప్పుడు మాట్లాడుకోవలసిన అవసరం ఏమిటీ? అనే సందేహం రావడం సహజం. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి .. ఆ విషయాన్ని దర్శకుడు కదీర్ స్వయంగా చెప్పాడు కాబట్టి. అవును .. ఆయనే తాను ఈ సినిమా సీక్వెల్ పనుల్లో ఉన్నట్టుగా చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ప్రేమదేశం' వంటి సినిమా మళ్లీ రాలేదని చాలామంది నాతో అంటున్నారు. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దాంతో నేను కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. 'ప్రేమదేశం' తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయింది. అందువలన తెలుగులోనే సీక్వెల్ చేసి తమిళంలోను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. కొత్త నటీనటులతో సీక్వెల్ ప్లాన్ చేశాను. టాలెంట్ ఉన్న నూతన నటీనటులతో పాటు నిర్మాతను కూడా వెతికే పనిలో ఉన్నాను. అంతా అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీక్వెల్ ఏ స్థాయిలో యూత్ ను ఊపేస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa