నెల్లూరులో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి నెల్లూరుకు ఓఆర్ఆర్ అవసరం లేదని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రీలేయిడ్ ఫ్లైఓవర్ను మంత్రి నారాయణ ఆదివారం ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన మంత్రి నారాయణ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ఫ్లైఓవర్ ప్రాజెక్టును రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని1999లో ప్రారంభించారని అన్నారు. అయితే ఆ తర్వాత 25 సంవత్సరాలలో ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదని, ఫ్లైఓవర్ ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. స్థానికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తమ ప్రభుత్వం మరమ్మతు పనులను ప్రారంభించిందని..45 రోజుల్లో మొత్తం ఫ్లైఓవర్ రోడ్డును పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు రోడ్డు, వంతెన మరమ్మతు పనులు త్వరలో చేపడతామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ పనులు పూర్తి అయితే ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యకు బైపాస్, ఫ్లైఓవర్ నిర్మాణం పరిష్కారమన్న మంత్రి.. ప్రస్తుతానికి నెల్లూరుకు ఓఆర్ఆర్ అవసరం లేదని అన్నారు. జనాభా పెరిగి, ట్రాఫిక్ సమస్య అధికమైతే ఓఆర్ఆర్ ప్రాజెక్టు అవసరమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రూ.3,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్న నెల్లూరు ఓఆర్ఆర్ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు నెల్లూరులో ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అదే ఏడాది అనుమతి వచ్చింది. ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రకటన కూడా విడుదలైంది. ఈ ప్రాజెక్టును ఓ సంస్థకు కూడా అప్పగించారు. 2022 మే 13న తుది నివేదిక కూడా వచ్చింది. అయితే అప్పటి నుంచి నెల్లూరు ఓఆర్ఆర్ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడలేదు. 2025 సెప్టెంబరు 4న అలైన్మెంట్ మీద సమావేశం కూడా నిర్వహించారు.
అయితే ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మరోవైపు 9 మండలాలోని 38 గ్రామాలను కలిపేలా నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు రచించారు. నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఓఆర్ఆర్ వెళ్లేలా ప్రణాళికలు రచించారు. పెన్నానదిపై 1200 మీటర్ల పొడువుతో వంతెన చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే ప్రాజెక్టుపై ఎలాంటి పురోగతి లేకపోగా.. తాజాగా మంత్రి నారాయణ నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa