ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 ఏళ్లుగా ఆ ఊరిలో కోడి కూయదు.. మద్యం మాటే లేదు, ఆఖరికి గుడ్డు కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 07:10 PM

నేటి ఆధునిక ప్రపంచంలోనూ మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాలు చట్టాల కంటే బలంగా పనిచేస్తాయి. అలాంటిదే అనంతపురం జిల్లాలో ఓ ఊరు ఉంది. సుమారుగా నాలుగు వందల సంవత్సరాలుగా ఆ ఊరిజనం ఓ ఆచారాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ' అడిగుప్ప ' గ్రామం. 400 సంవత్సరాలుగా ఈ ఊరిలో కోళ్లను పెంచరు. మాంసం, కోడిగుడ్లు తినరు, మద్యం ఊసే ఎత్తరు. అయితే ఈ కట్టుబాటు వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఈ విచిత్రమైన ఆచారం వెనుక ఒక వీరగాథ ప్రచారంలో ఉంది. సుమారు నాలుగు శతాబ్దాల కిందట ఈ గ్రామాన్ని ఒక పాలెగాడు (రాజు) పాలించేవాడు.


ఇతనికి రాయదుర్గంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదట. ప్రియురాలిని కలిసేందుకు ఆయన ప్రతిరోజూ రాయదుర్గం వెళ్తుండేవారు. అయితే ఈ విషయం కర్ణాటకలోని చిత్రదుర్గ రాజు అయిన చిన్నయ్యకు తెలిసింది. చిన్నయ్య అడిగుప్ప కొండల్లో ఉన్న నిధిని దక్కించుకోవాలని పథకం వేశాడు. అందులో భాగంగా ఓ రోజు శత్రు సైనికులకు మద్యం, మాంసం ఎరవేసి మత్తులో ముంచాడట. వారు మత్తులో ఉన్న సమయంలో నిధిని కాజేసేందుకు ప్రయత్నించారట. అయితే, అడిగుప్ప రాజుల దేవరస్వామి (కులదైవం) రాజు కలలోకి వచ్చి శత్రువుల కుట్రను అతనికి తెలియజేశారట.


దీంతో అప్రమత్తమైన అడిగుప్ప రాజు వెంటనే అడిగుప్పకు చేరుకుని చిన్నయ్య సైన్యాన్ని అంతం చేసి నిధిని కాపాడారని ఇక్కడి జనం చెప్తుంటారు. ఆ విజయం తర్వాత, అడిగుప్ప రాజు మద్యం, మాంసం వలనే ఇంత వరకూ వచ్చిందనే భావనతో.. ఇకపై తమ గ్రామంలో ఎవరూ మద్యం, మాంసం ముట్టబోమని ఊరిజనంతో ప్రమాణం చేయించారట. ఇక అప్పటి నుంచి ఈ కట్టుబాటు కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు.


మరోవైపు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు గుడ్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో కూడా కోడిగుడ్లు వడ్డించరు. ఎవరైనా ఈ కట్టుబాటును మీరితే అనారోగ్యం పాలుకావడమో, లేదా ఆస్తి నష్టం కలగడమో జరుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు.మరోవైపు అడిగుప్ప గ్రామంలో ఎక్కువ మంది పేర్ల చివరన రాజు అని ఉంటుంది. అలాగే అడిగుప్ప రాజును కీర్తిస్తూ ప్రతి ఏటా ఫిబ్రవరిలో జాతర నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa