శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాశీబుగ్గ ఆలయంలో నవంబర్ ఒకటో తేదీన తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కార్తీక ఏకాదశి, శనివారం రెండూ కలిసి రావటంతో.. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు చనిపోవటం సంచలనం రేపింది. అయితే ఈ ఘటన జరిగి మూడు నెలలు కూడా తిరగకముందే కాశీబుగ్గ ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
అయితే ఈసారి కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఆలయం వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు.. ఆలయంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఆలయ నిర్వాహకులు హరిముకుంద పండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన విషయాన్ని సోమవారం గుర్తించారు. ఈ ఘటనలో 60 లక్షల రూపాయలు విలువ చేసే నగలు దొంగతనానికి గురైనట్లు హరిముకుంద పండా చెప్తున్నారు.
మరోవైపు ఆలయ నిర్వాహకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ డీఎస్పీ, సీఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.మరోవైపు 2025 నవంబర్ ఒకటో తేదీ కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది చనిపోయారు. అయితే కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రైవేట్ దేవాలయం కాగా.. ఆలయ నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని దేవాదాయ శాఖ అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తుగా అనుమతి తీసుకోలేదన్నారు. ఈ ఘటన అనంతరం కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
మరోవైపు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. హరిముకుంద పండా గతంలో ఓసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో ఇబ్బందులు ఎదురుకావటంతో.. సొంతంగా ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. సొంత నిధులతో కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటం, కార్తీక ఏకాదశి పర్వదినం శనివారం రోజున రావటంతో .. ఆ రోజు వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తులు భావించడం.. ఆలయంలో రద్దీకి కారణమైంది. దీంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు అప్పట్లో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa