సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు కొత్త కళ వచ్చింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు పండగ శోభను సంతరించుకున్నాయి. అయితే గోదారి జిల్లాల్లో పండగ సందడి కంటే వసతి గదుల ధరలే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా కోడిపందాలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే భీమవరంలో.. హోటల్ గదుల రేట్లు భారీగా పెరిపోయాయి. భీమవరంలో డిమాండ్ను అనుసరించి హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని ప్రముఖ హోటళ్లలో అయితే 3 రోజుల కోసం ఏకంగా రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ ప్రాంతంలో సాధారణ రోజుల్లో హోటల్ గదుల రేట్లు రోజుకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు ఉంటాయి. అయితే డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఈ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండుగ ప్యాకేజీల పేరుతో హోటల్ గదుల అద్దెలను 3 రోజులకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు పెంచేశారు. మరోవైపు భీమవరంలోని కొన్ని చోట్ల ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి రూ. లక్ష వరకూ డిమాండ్ చేస్తున్నారు. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లోని దాదాపు 150 హోటళ్లలో గదులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. హోటల్స్లలో గదులు దొరక్కపోవడంతో పర్యాటకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఇళ్లు, కళ్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటి యజమానులు కూడా అద్దెలను భారీగా పెంచినట్లు సమాచారం.
అయితే భీమవరం చుట్టు పక్కల ప్రాంతాలలో ఈ స్థాయిలో అద్దెలు పెరగడానికి కోడిపందేల ప్రభావం ఎక్కువగా ఉంది. హై-ప్రొఫైల్ బెట్టింగ్లు, కోడిపందేల నిర్వాహకులు, పందెం రాయుళ్ల తాకిడి పెరగడంతోనే హోటల్స్ గదుల అద్దెలు ఈ స్థాయిలో పెరిగాయని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, విలాసవంతమైన ఏర్పాట్లు, బఫేలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
కోడిపందేలు చూడటానికి, పాల్గొనడానికి పెద్దఎత్తున రాజకీయ నేతలు, ప్రముఖులు వస్తుంటారు. వీరంతా హోటల్ గదులను ముందస్తు బుకింగ్ చేసుకోవటంతో.. ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. మరోవైపు హోటల్ గదుల అద్దెలపై నియంత్రణ లేకపోవటం కూడా హోటల్ యజమానులు ఇష్టానుసారం రేట్లు పెంచడానికి ఓ కారణంగా పర్యాటకులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa