ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ల్లో అశ్లీలతపై సెన్సార్బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని.. ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్ సిరీస్ల్లో అశ్లీలత ఉందన్నారు. దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు.
ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లోకేషన్లు, పోలీసు బందోబస్తు, అనుమతి త్వరగా ఇవ్వడం వంటి సదుపాయాలు కల్పిస్తే చాలామంది ఇక్కడ సినిమాలు తీయడానికి ముందుకు వస్తారని సుమన్ అంటున్నారు. తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేనని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పుకొచ్చారు.
విజయవాడ రూరల్ మండలం పి.నైనవరంలో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.