|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 05:07 PM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనను "దేశద్రోహి" అనడంపై తెలంగాణ మంత్రి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన హెచ్చరించారు. నేడు అజారుద్దీన్, కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు."దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన నేను దేశద్రోహినా?" అని అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, మాట్లాడటానికి మరే అంశం లేక బీజేపీ నేతలు పదేపదే పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకునే బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోందని ఆరోపించారు.కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసని అజారుద్దీన్ ప్రశ్నించారు. "ఆయనకు కనీసం క్రికెట్ బ్యాట్ అయినా సరిగ్గా పట్టుకోవడం వచ్చా?" అంటూ ఘాటుగా విమర్శించారు. తన మంత్రి పదవి కేవలం ఆరు నెలల పాటేనని, త్వరలో ఎమ్మెల్సీ కాలేరని వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ఈ విమర్శలన్నింటికీ కాలమే సరైన సమాధానం చెబుతుందని అజారుద్దీన్ పేర్కొన్నారు.