|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 07:14 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1037 మంది ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వీరి సేవల పొడిగింపు, వేతనం, ఇతర నియమాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు నెలకు రూ. 19,500 చొప్పున వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరి సేవలను కొనసాగించేటప్పుడు కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నియామకానికి సంబంధించిన పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
ఏ జిల్లాలోనైనా గ్రామ పంచాయతీల సంఖ్యను మించి పంచాయతీ సెక్రటరీల సంఖ్య ఉండకుండా చూసుకోవాలని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు . పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటినీ సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో వీరు ముఖ్య వారధిగా పనిచేస్తారు. గ్రామ పంచాయతీల పరిపాలన, పన్నుల వసూలు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తారు.
రాష్ట్రంలో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా.. ఈ ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలు అత్యంత అవసరం అయ్యాయి. వీరి పొడిగింపు నిర్ణయం ద్వారా గ్రామాలలో పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం.. వేలాది మంది కార్యదర్శులు, వారి కుటుంబాలకు పెద్ద ఊరటగా నిలిచింది. భవిష్యత్తులో వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించే దిశగా కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఈ కార్యదర్శులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల విషయంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న క్రీడల కోటా పోస్టులకు నియామకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎంపికైన 172 మంది క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లైంది.