ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల్లో నివసించే వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. ‘పల్లె’ రాత మార్చేలా అడుగులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 04:56 PM

తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. చాలా వరకు గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం, ఇంటింటికి తాగునీరు అందుబాటులోకి వచ్చాయి. మారుమూల పల్లెల్లో సైతం మౌలిక వసతులు మెరుగయ్యాయి. అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాఠశాల, వైద్య సదుపాయం, మురుగునీటిపారుదల లాంటి సదుపాయాలు అన్ని గ్రామాల్లో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది. రెవెన్యూ గ్రామం ఒక యూనిట్‌గా.. అక్కడి ప్రజల అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గానూ ఏయే గ్రామాల్లో ఏయే సదుపాయాలు ఉన్నాయి.. ఇంకా ఏయే సదుపాయాలు కల్పించాల్సి ఉందనే సమాచారం సేకరించనున్నారు. ఈ దిశగా ప్రణాళిక సంఘం రంగంలోకి దిగుతోంది.


తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 11 వేల రెవెన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకా ఏమేం సౌకర్యాలు అవసరమనే వివరాలను తెలంగాణ ప్రణాళిక సంఘం త్వరలోనే సేకరించనుంది. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి అందిస్తామని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చెన్నారెడ్డి చెప్పారు. ప్రణాళిక సంఘం ఇవ్వబోయే నివేదిక ఆధారంగా.. గ్రామాల్లో సౌకర్యాలను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. అన్ని గ్రామాల్లోనూ విద్య, వైద్యం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి సదుపాయాలన్నీ కల్పించాలనే లక్ష్యంతో తాము పని చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు.


త్వరలో పంచాయతీ ఎన్నికలు..!


తెలంగాణలో ఇప్పటికే గ్రామపంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసింది. గ్రామాలు ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈలోగా గ్రామాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం కోసం.. గ్రామీణ ఓటర్లు తమతోనే ఉన్నారని చాటడం కోసం కాంగ్రెస్ సర్కారు గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టే దిశగా అడుగులేస్తోంది.


ఫిబ్రవరి చివర్లో బాధ్యతలు చేపట్టిన చిన్నారెడ్డి


ఈ ఏడాది ఫిబ్రవరిలో నెలలో చిన్నారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా నియమించింది. ఫిబ్రవరి 29న ఆయన బాధ్యతలు చేపట్టారు. వనపర్తి నుంచి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి.. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. ఆయనకు అవకాశం రాలేదు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్‌గా తనదైన మార్క్ చూపించాలని చిన్నారెడ్డి ఆరాటపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa