ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ ప్రముఖుల ఓటమి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 05:08 PM

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 400కి పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో పలువురు భారత సంతతి బ్రిటిష్ పౌరులు విజయాన్ని అందుకున్నారు. రిషి సునాక్, శివానీ రాజా, కనిష్క నారాయణ, సుయెల్లా బ్రేవర్మన్, ప్రీత్ కౌర్ గిల్, సత్‌వీర్ కౌర్ తదితరులు విజయం సాధించారు. ఇవే ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు తెలుగు ప్రముఖులు మాత్రం ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరొందిన ఉదయ్‌ నాగరాజు ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తరఫున నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ స్థానం పోటీ చేశారు. ఈయన స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం. యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈయనకు బంధువు. తెలుగు సంతతి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి కూడా ఓటమి పాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తయిన తర్వాత లండన్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పని చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa