తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ ఇవాళ ఉదయం అక్కడకు చేరుకున్నారు. అనంతరం మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రధాని మోదీ అబద్దాలు చెప్పటం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికే తాను ఇక్కడకు వచ్చినట్లు గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రైతుల విషయంలో ప్రధాని మోదీ విమర్శలకు తాము సరైన సమాధానం ఇచ్చామని.. తాము నిజాలు చెప్పగానే ఆయన తన ట్వీట్ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో తమ పార్టీ అధికారాంలోకి వస్తే.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే.. 22,22,067 మంది రైతుల ఖాతాల్లో రూ.17,869 కోట్ల మాఫీ డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చామని.. ప్రస్తుత సీజన్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం అందించేందుకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినట్లు రేవంత్ వెల్లడించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువ అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని ఫైర్ అయ్యారు. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని రేవంత్ అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తు చేశారు. అటువంటి మహా ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను మోదీ గుజరాత్కు తరలించుకొని పోయారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa