ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరణించిన తర్వాత కూడా జీవించేందుకు అత్యుత్తమ మార్గం ఇదే: సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 07:10 PM

దీపం తాను ఆరిపోతూ చుట్టూ ఉన్నవారికి వెలుగులు పంచుతుంది. అవయవ దానం చేసేవారు కూడా అంతే.. తాను చనిపోయినా.. అవయవదానంతో పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇదే విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరణించిన తర్వాత జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం అని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయని చెప్పారు. వెంకటేష్ నాగేష్ కులకర్ణి అనే యువకుడు చనిపోతే.. పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారని ట్వీట్ చేశారు.


వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ నాగేష్ కులకర్ణి (24) అనే యువకుడు ఈనెల 4న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన బైక్‌పై వెళ్తుండగా.. బోధన్ పట్టణంలోని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు యువకుడిని వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించటంతో అత్యవసర వైద్య సేవల అదే రోజు హైదరబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు వైద్య చికిత్సలు అందించగా.. ఫలితం లేకుండా పోయింది.


వెంకటేష్ బ్రెయిన్ డెడ్ (జీవన్మృతుడు) అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ బృందం వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి.. అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవదానానికి వారు అంగీకారం తెలపటంతో అతడి గుండె, రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారికి అమర్చారు. రెండు కంటి కార్నియాలను చూపు లేని వారికి అమర్చినట్లు జీవన్‌దాన్ నోడల్ అధికారి వెల్లడించారు. ఇలా తాను చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు వెంకటేష్.


ఈ వార్తను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్టు చేశారు. 'మరణించిన తర్వాత జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయి. పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి అవయవాలను దానం చేసి.. ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించిన వెంకటేష్ నాగేష్.' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు. తాను చనిపోయినా.. వెంకటేష్ ఎప్పుడూ చిరంజీవే అని పోస్టులు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa