ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఈ 4 ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు.. ఇక ప్రపంచంతోనే మన పోటీ: సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 07:42 PM

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్ పోర్టులు ఉంటే తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళితే.. అక్కడ బస్ డిపోల మాదిరిగా ప్రతి 150 కి.మీలకు ఓ ఎయిర్‌పోర్టు ఉందన్నారు. ఏపీలోనూ విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు ున్నాయని.. తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఎయిర్‌పోర్టు ఉందని చెప్పారు. అందుకే వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలను స్థాపించనున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎయిర్‌పోర్టుల స్థాపనతో ప్రపంచంతో పోటీపడి రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకొస్తామన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


ఏడాది పాలన సందర్భంగా 'ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు' కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం (నవంబర్ 19) వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ఒకేసారి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు.


రాష్ట్రానికి ప్రతి నెలా 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై అప్పు, వడ్డీ కింద మరో 6,500 కోట్లు పోతున్నాయని, ఇక మిగిలిన 5,500 కోట్ల ఆదాయం ఉంటే... ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ రూపాయి రూపాయి కూడబెట్టి రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత, ప్రాశస్త్యం కలిగిన వరంగల్ జిల్లా గత పదేండ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురైందన్నారు. అందుకే హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భౌగోళికంగా సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్టవుతుందన్నారు.


జాతీయస్థాయి పరిశ్రమలు, ఇక్కడ ఎయిర్‌పోర్టు రావడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ వర్సిటీ అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా సగం తెలంగాణ అభివృద్ధి బాట పట్టినట్టేనని భావించి ఈ బాధ్యత తీసుకుందని సీఎం రేవంత్ చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని.. ఏ గడ్డ నుంచి పోరాటం మొదలుపెట్టామో ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అదే గడ్డమీద ఉత్సవం జరుపుకున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసం ఒక్క రోజు... ఒక్క నిమిషం... సెలవు తీసుకోకుండా రోజు 18 గంటలు పనిచేస్తానని.. ఆఖరు శ్వాస వరకు... చివరి రక్తపు బొట్టు వరకు... తెలంగాణ కోసం అంకితమవుతానని సీఎం రేవంత్ వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa